ENG vs PAK: ‘సారీ బ్రదర్‌.. దీన్నే కర్మ అంటారు’.. షోయబ్‌ అక్తర్‌కి షమి అదిరిపోయే కౌంటర్‌

టైటిల్‌ పోరులో పాకిస్థాన్ ఓటమిపాలు కావడంతో ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఒక బాధాకరమైన ట్వీట్‌ చేశాడు. బ్రొకెన్ హార్ట్‌ ఎమోజీని ట్వీట్ చేస్తూ.. పాక్ ఓటమితో గుండె బద్దలైందనట్లుగా తన బాధను వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌కు భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఆసక్తికర కౌంటర్ ఇచ్చాడు. 

Updated : 14 Nov 2022 09:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రెండోసారి టీ20 ప్రపంచకప్‌ని సొంతం చేసుకోవాలనుకున్న పాకిస్థాన్‌ ఆశలపై ఇంగ్లాండ్‌ నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాక్‌పై ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది విశ్వవిజేతగా అవతరించింది. టైటిల్‌ పోరులో పాకిస్థాన్ ఓటమిపాలు కావడంతో ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఒక బాధాకరమైన ట్వీట్‌ చేశాడు. బ్రొకెన్ హార్ట్‌ ఎమోజీని ట్వీట్ చేస్తూ.. పాక్ ఓటమితో గుండె బద్దలైందన్నట్లుగా తన బాధను వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌కు భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఆసక్తికర కౌంటర్ ఇచ్చాడు. 

అక్తర్‌ చేసిన ట్వీట్‌కు ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, షమి ఇలా స్పందించడానికి కారణం లేకపోలేదు. సెమీ ఫైనల్-2‭లో ఇంగ్లాండ్ చేతిలో భారత్‌ ఓడిపోయిన అనంతరం టీమ్‌ఇండియా ఆటతీరును పాక్ ఆటగాళ్లు హేళన చేశారు. ఫైనల్‌లో భారత్‌తో తలపడాలని పాక్‌ ఎదురుచూసిందని.. ఇకపై అది సాధ్యం కాదని అక్తర్‌ ఎద్దేవా చేశాడు. ‘భారత్‌కు ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమికి వారు అర్హులే. ఫైనల్‌కు చేరే అర్హత వారికి లేదు’ అని తన అక్కసును వెళ్లగక్కాడు. ‘సెమీస్‌తో పోల్చితే ఇంగ్లాండ్‌ మంచి స్థితిలో ఉంది. వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఇంగ్లాండ్‌కు తెలుసు.. పాక్‌ బౌలర్లు టీమ్ఇండియా బౌలర్ల మాదిరి కాదని. మాపై విజయం సాధించడం అంత సులభం కాదు. వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది’ అని  మరోసారి అక్తర్‌ వ్యాఖ్యానించాడు. ఈ రెండు సందర్భాల్లో షోయబ్‌.. టీమ్‌ఇండియాపై విమర్శలు గుప్పించడంతో వాటన్నింటిని తిప్పికొడుతూ అక్తర్‌ చేసిన ట్వీట్‌కు షమి పైవిధంగా కౌంటర్‌ ఇచ్చాడు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని