IND vs ENG: కథ మారింది..!

ఇంగ్లాండ్‌లో అయిదు టెస్టుల సిరీస్‌.. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్‌కు 2-1 ఆధిక్యం.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఊపులో చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ చేజిక్కించుకుంటారనుకుంటే కరోనా కారణంగా నిరుడు ఆ టెస్టు జరగలేదు.

Updated : 30 Jun 2022 07:27 IST

ఈనాడు క్రీడావిభాగం

ఇంగ్లాండ్‌లో అయిదు టెస్టుల సిరీస్‌.. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్‌కు 2-1 ఆధిక్యం.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఊపులో చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ చేజిక్కించుకుంటారనుకుంటే కరోనా కారణంగా నిరుడు ఆ టెస్టు జరగలేదు. ఆ మ్యాచ్‌ ఆడేందుకు, సిరీస్‌ పూర్తి చేసేందుకు ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టింది భారత్‌. అయితే ఈ తొమ్మిది నెలల విరామంలో ఇరు జట్లు చాలా మారిపోయాయి.. ఆట కూడా మారిపోయింది. ఆ మార్పులేంటో.. ఎవరి ఫామ్‌ ఎలా ఉందో.. చివరి టెస్టులో ఎవరి అవకాశాలెలా ఉన్నాయో.. చూద్దాం పదండి.


‘‘ఆటగాడి కెరీర్‌లో భిన్న దశలు ఉంటాయి. కోహ్లి ప్రస్తుత పరిస్థితికి (అంతగా ఫామ్‌లో లేకపోవడం)కి కారణం ప్రేరణ కొరవడడమో, బలమైన కోరిక లేకపోవడమో కాదు. ఎప్పుడూ సెంచరీ చేస్తేనే బాగా ఆడినట్లు కాదు. కేప్‌టౌన్‌లో క్లిష్ట పరిస్థితుల్లో చేసిన 79 పరుగుల ఇన్నింగ్స్‌ కూడా ఎంతో విలువైందే. కోహ్లి ఎంతటి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడాంటే.. జనం ఇప్పుడు సెంచరీ కొడితేనే అతడు విజయవంతమైనట్లు భావిస్తారు. ఒక కోచ్‌గా నేనైతే అతడి నుంచి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనను కోరుకుంటా. అది 50 పరుగుల ఇన్నింగ్స్‌ కావొచ్చు లేదా 60 పరుగుల ఇన్నింగ్స్‌ కావొచ్చు’’

- రాహుల్‌ ద్రవిడ్‌

 


ఆ ఛేదన.. ఓ హెచ్చరిక

త ఏడాది సిరీస్‌లో నాలుగో టెస్టు ముగిసినప్పటికి.. ఇప్పుడు అయిదో టెస్టు ఆరంభ సమయానికి పోల్చి చూస్తే ఇంగ్లాండ్‌ జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ జట్టులో అతి పెద్ద మార్పు అంటే.. కెప్టెన్సీ విషయంలోనే. అప్పటి కెప్టెన్‌ రూట్‌.. ఇటీవలే జట్టు పగ్గాలు వదులుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత రూట్‌ మరిన్ని సిరీస్‌ల్లో పరాభవాలు చవిచూశాడు. దీంతో అతడిపై సెలక్టర్లు వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో రూట్‌యే తనకు తానుగా నాయకత్వ బాధ్యతలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో బెన్‌ స్టోక్స్‌ సారథిగా నియమితుడయ్యాడు. అతను నిరుడు భారత్‌తో సిరీస్‌కు అందుబాటులో లేడు. మానసిక సమస్యలతో అప్పుడు అతను ఆడలేదు. ప్రస్తుతం కెప్టెన్‌గా నియమితుడయ్యాక తొలి సిరీస్‌లోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌పై 3-0తో జట్టును గెలిపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. మూడింట్లోనూ గొప్పగా రాణించే స్టోక్స్‌ లాంటి ఆటగాడు జట్టులో ఉండడమే గొప్ప బలం. దీనికి తోడు అతను సారథ్య బాధ్యతలు చేపట్టడంతో ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాడు. రక్షణాత్మకంగా కనిపించే రూట్‌తో పోలిస్తే అతడి నాయకత్వ శైలి పూర్తి భిన్నం. ఆటలో మాదిరే సారథ్యం విషయంలోనూ అతను దూకుడుగా ఉంటాడు. చివరి టెస్టులో ఇంగ్లాండ్‌కు కివీస్‌ 296 పరుగుల లక్ష్యం నిర్దేశించగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత లక్ష్యాన్ని ఛేదించేటపుడు ఏ జట్టయినా ఆచితూచి ఆడుతుంది. కానీ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం వన్డే తరహాలో దూకుడుగా ఆడి 54.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించారు. స్టోక్స్‌ సారథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు దృక్పథం ఎలా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం. కివీస్‌తో ఆడినట్లే భారత్‌పైనా దూకుడుగా ఆడతామని స్టోక్స్‌ చెప్పడం మన జట్టుకు హెచ్చరికగానే భావించాలి.


ఆత్మవిశ్వాసం పతాక స్థాయిలో..

ట్టుగా కూడా ఇంగ్లాండ్‌లో చాలా మార్పు కనిపిస్తోంది అప్పటికి, ఇప్పటికి. స్టోక్స్‌, బ్రాడ్‌ లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో అప్పుడు జట్టు బలహీనపడింది. ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు. అండర్సన్‌తో బ్రాడ్‌ సమన్వయమే వేరు. ఒక ఎండ్‌లో అతను ఒత్తిడి పెంచుతుంటే.. మరో ఎండ్‌లో జిమ్మీ వికెట్లు తీస్తాడు. అలాగే బ్రాడ్‌ వికెట్లు తీయడానికి కూడా తోడ్పడతాడు. వీరికి పాట్స్‌ లాంటి ప్రతిభావంతుడైన పేసర్‌ తోడవడంతో ఇంగ్లాండ్‌ పేస్‌ దాడి పదునెక్కింది. స్టోక్స్‌ నాలుగో పేసర్‌గా ఉపయోగపడుతున్నాడు. స్పిన్నర్‌ లీచ్‌ మంచి ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. కెప్టెన్సీ భారం తొలగిపోవడంతో రూట్‌ స్వేచ్ఛగా ఆడుతున్నాడు. కివీస్‌తో సిరీస్‌లో అతను అదరగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. బెయిర్‌స్టో భీకర ఫామ్‌లో ఉన్నాడు. పోప్‌ కూడా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. స్టోక్స్‌ ఉపయుక్తమైన పరుగులు చేస్తున్నాడు. ఓపెనర్లు క్రాలీ, లీస్‌ మాత్రమే అంచనాలకు తగ్గట్లు రాణించట్లేదు. అంతకుమించి ఇంగ్లిష్‌ జట్టుకు సమస్యలేమీ లేవు. అన్నింటికీ మించి ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసం ఇప్పుడు పతాక స్థాయిలో ఉంది. నిరుడు భారత్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్‌ను మూడు టెస్టుల్లో మట్టికరిపించి.. టీమ్‌ఇండియాతో మ్యాచ్‌కు సిద్ధమవుతుండటం ఆ జట్టుకు విశ్వాసాన్ని రెట్టింపు చేసేదే.


వీళ్లు ఫామ్‌లో లేరు.. వాళ్లు లేరు

నిరుడు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత టీమ్‌ఇండియా పరిస్థితి పూర్తి భిన్నమే. తొమ్మిది నెలల్లో వ్యవహారం చాలా మారిపోయింది. అప్పుడు కెప్టెన్‌ కోహ్లి కాగా.. తర్వాత అతను టెస్టులతో పాటు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఇప్పుడతను ఒక ఆటగాడిగా, అది కూడా పేలవ ఫామ్‌తో ఈ మ్యాచ్‌లో అడుగు పెడుతున్నాడు. గత ఏడాది కూడా ఈ సిరీస్‌లో కోహ్లి అంచనాలకు తగ్గట్లు రాణించలేదు కానీ.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు అతడి ఆట ఇంకా తగ్గింది. చెతేశ్వర్‌ పుజారా పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఒకప్పుడు జట్టులో అత్యంత నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న పుజారా.. కొంత కాలంగా జట్టుకు భారమవుతున్నాడు. కౌంటీల్లో సత్తా చాటడంతో అతడికి సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు కానీ.. దీన్ని అతనెంత మేర ఉపయోగించుకుంటాడన్నది సందేహం. ఇక టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాక రోహిత్‌ విదేశాల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. కొవిడ్‌ బారిన పడడంతో ప్రస్తుత మ్యాచ్‌కు దాదాపు దూరమైనట్లే కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌ (127)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్‌. అతను ఆడకుంటే ఓపెనింగ్‌లో ఇబ్బందులు తప్పవు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్‌, ఇంగ్లాండ్‌లో మెరుగైన రికార్డున్న కేఎల్‌ రాహుల్‌ కూడా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరం కావడం ప్రతికూలతే. మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రహానె పేలవ ఫామ్‌తో పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. ఇలా బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లను కోల్పోవడమే కాకుండా, ఉన్న ఆటగాళ్ల పేలవ ఫామ్‌ భారత్‌ను కలవర పెడుతోంది.

 


బౌలింగ్‌.. భరోసానే

సొంతగడ్డపై భారత్‌కు ఎప్పుడూ ఎదురు లేదు కానీ.. పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై మనవాళ్ల తడబాటు తెలిసిందే. నిరుడు ఇంగ్లాండ్‌పై ఆ తడబాటు కనిపించలేదు. ప్రత్యర్థి బలహీనతలు కూడా మనకు కలిసొచ్చాయన్నది వాస్తవం. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు ఎదురు దెబ్బ తప్పలేదు. ఒక టెస్టు మ్యాచ్‌ నెగ్గినా.. మిగతా రెండూ ఓడి సిరీస్‌ కోల్పోయింది. సొంతగడ్డపై ఎన్ని మ్యాచ్‌లు నెగ్గినా ఇప్పుడవి లెక్కలోకి రావు కాబట్టి ఫామ్‌ పరంగా భారత్‌ గొప్ప స్థాయిలో ఏమీ లేదనే చెప్పాలి. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో సీనియర్లు కోహ్లి, పుజారాలకు తోడు హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి యువ ఆటగాళ్లు అవకాశాలను ఏమేర ఉపయోగించుకుంటారో చూడాలి. ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్‌కు భరోసానిస్తోంది బౌలింగే. ఇంగ్లాండ్‌తో తొలి నాలుగు టెస్టుల్లో అదరగొట్టిన బౌలర్లందరూ ఇప్పుడు కూడా జట్టులో కొనసాగుతున్నారు. బుమ్రా, షమి జట్టుకు పెద్ద బలం. వీవీరు బౌలింగ్‌ దాడిని ముందుండి నడిపిస్తారనే ఆశతో భారత్‌ ఉంది. అలాగే సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. జడేజా, అశ్విన్‌ రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్ల అండా ఉంది. అండర్సన్‌ బృందం స్వింగ్‌, పేస్‌ పరీక్షను కాచుకుని బ్యాట్స్‌మెన్‌ మంచి స్కోర్లు సాధిస్తే.. మిగతా పని బౌలర్లు చూసుకుంటారు. ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ నుంచి వారికి సవాలు ఎదురైనా నిలబడతారనే నమ్మకముంది. కాబట్టి మ్యాచ్‌ ఫలితం బ్యాట్స్‌మెన్‌ ఎలా రాణిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని