Dhoni: అక్కడ ప్రారంభించకపోతే.. ఈ స్థాయికి చేరుకోలేము: ధోనీ

ఏ క్రికెటర్‌కైనా జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలే ముఖ్యమని, అక్కడి నుంచే క్రికెటర్ల ప్రయాణం మొదలవుతుందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు...

Published : 03 Jun 2022 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ క్రికెటర్‌కైనా జిల్లాస్థాయి పోటీలే కీలకమని, అక్కడి నుంచే క్రికెటర్ల ప్రయాణం మొదలవుతుందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు. తాజాగా తిరువల్లూర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ 25వ వార్షికోత్సవంలో పాల్గొన్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన రాంచీ క్రికెట్‌ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మొదట తాను క్రికెట్‌ ఆడటం ప్రారంభించినప్పుడు స్కూల్‌ పోటీల్లో మంచి ప్రదర్శన చేయాలనుకున్నానని, దాంతో జిల్లా స్థాయి జట్టుకు.. అక్కడి నుంచి అంతర్‌ జిల్లా పోటీలకు.. అక్కడి నుంచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికవ్వాలనుకున్నట్లు వెల్లడించాడు. అంతిమంగా ఎవరైనా అలా ఎదుగుతూ టీమ్‌ఇండియాకే ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు.

‘మీరు కూడా మొదట స్కూల్‌ స్టేజ్‌లో.. అక్కడి నుంచి జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్ర స్థాయికి.. ఆపై రంజీ జట్టుకు తర్వాత టీమ్‌ఇండియాకు ఆడాలనుకుంటారు. అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టామన్నది గుర్తుంచుకోవాలి. జిల్లా స్థాయి జట్టులో చోటు దక్కించుకోవాలని చాలా మంది ఆశపడతారు. దాంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు మేటి ఆటగాళ్లే క్రమంగా పై స్థాయిలకు ఎదుగుతారు. తద్వారా జిల్లా స్థాయి జట్లతో పాటు రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా నాణ్యమైన ఆటగాళ్లతో నిండిపోతాయి. అది అందరికీ మంచిది. నేను టీమ్‌ఇండియా తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తా. ఒకవేళ నేను జిల్లా స్థాయిలో ఆడకపోతే ఇక్కడిదాకా వచ్చేవాడిని కాదు. కాబట్టి ఆ స్థాయిలో క్రికెట్‌ ఆడినందకు ఎవరైనా గర్వపడాలి. అక్కడ మన ప్రయాణం మొదలవ్వకపోతే టీమ్‌ఇండియాలో ఆడే అవకాశం రాదు. ఈ నేపథ్యంలో మేటి ఆటగాళ్లను ఎంపిక చేయడంలో జిల్లా స్థాయి క్రికెట్‌ అసోసియేషన్ల బాధ్యత చాలా ఉంది. వాళ్లు ఏటా టోర్నీలు నిర్వహించి, అందుకు పాఠశాలల స్థాయిలో పోటీలు నిర్వహించడం, మంచి ఆటగాళ్లను వెలికి తీయడం కష్టంగా ఉంటుంది’ అని ధోనీ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని