Tokyo Olympics: అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి: మోదీ

ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో టోక్యోకు పయనమవుతున్న...

Updated : 13 Jul 2021 19:49 IST

దిల్లీ: ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో టోక్యోకు పయనమవుతున్న వారితో ప్రధాని కొద్దిసేపటి క్రితం వర్చువల్‌ పద్ధతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.

ఈ సందర్భంగా ప్రధాని పలువురు దిగ్గజ క్రీడాకారులు మేరీకోమ్‌, పీవీ సింధు, సౌరభ్‌ చౌదరి, శరత్‌ కమల్‌ తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం సింధూని ప్రోత్సహించినందుకు ఆమె తల్లిదండ్రులను మోదీ మెచ్చుకున్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్‌ సంఘం అధ్యక్షుడు నరిందర్‌ బత్రా పేర్కొన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారని చెప్పారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు టోక్యోకు బయలుదేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని