MCC: ఫ్రాంచైజీ లీగ్‌ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాలి: ఎంసీసీ

అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు లీగ్‌లతో ఇబ్బంది తలెత్తుతోందనే అభిప్రాయం క్రీడా పండితుల్లో ఉంది. చిన్న దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడే జట్లు తగ్గిపోవడంపై ఆందోళనా వ్యక్తమవుతోంది. దీనిపై తాజాగా ఎంసీసీ (MCC) స్పందించింది.

Published : 10 Mar 2023 14:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల (T20 League Cricket) హవా నడుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023), బిగ్‌బాష్ లీగ్‌ (BBL), దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌.. ఇలా ఫ్రాంచైజీ క్రికెట్‌తో ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే, దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌ మనుగడకు కష్టంగా మారే అవకాశం ఉందనే ఆందోళన క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) కూడా ఇదే అంశంపై స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించింది.  అందుకోసం ఐసీసీ తక్షణమే జోక్యం చేసుకోవాల్సి ఉందని పేర్కొంది. లేకపోతే భవిష్యత్తు ప్రణాళిక కార్యాచరణ (FTP)పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని తెలిపింది. దుబాయ్‌ వేదికగా జరిగిన సమావేశం ఉద్దేశం కూడా ఇదేనని వెల్లడించింది. 

‘‘ఫ్రాంచైజీ క్రికెట్‌ క్రమంగా పెరుగుతోంది.  దీని వల్ల అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూలింగ్‌కు ప్రమాద ఘంటికలు మోగే అవకాశాలు లేకపోలేదు. అందుకే తక్షణమే క్రికెట్‌ ప్రపంచం స్పందించాలి. తక్కువ నిడివితో వచ్చిన ఫ్రాంచైజీ టోర్నీలతో ఇప్పుడు క్రికెట్ భవిష్యత్‌ షెడ్యూలింగ్‌ నిండిపోయిన వేళ.. అంతర్జాతీయ క్రికెట్‌ను ఎలా కాపాడుకోవాలి, రాబోయే పదేళ్ల కాలంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ను ఎలా వృద్ధిలోకి తీసుకోవాలనే విషయాలపైనే దుబాయ్‌ వేదికగా చర్చించాం. పురుషుల క్రికెట్‌ 2023 సీజన్‌ షెడ్యూల్‌ను తీసుకుంటే అందులో ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్‌కే చోటు దక్కింది. దీని వల్ల చిన్న దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు స్థానం లేకుండా పోతోంది.  ఇక మహిళల ఎఫ్‌టీపీ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ను దేశీయ లీగ్‌లు అతిక్రమించలేదు’’ అని ఎంసీసీ తెలిపింది.

పరిష్కారం కనుగొనాలి: గంగూలీ

‘‘టెస్టు క్రికెట్టే అసలైన గేమ్‌ అని ఇప్పటికీ నమ్ముతా. క్రికెట్‌ వ్యాప్తికి అదే పెద్ద ప్లాట్‌ఫామ్‌. గొప్ప ఆటగాళ్లుగా మనల్ని ఆవిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే, టెస్టు క్రికెట్‌కు ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్‌కు మధ్య బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలూ దీనిపై దృష్టిసారించాలి’’ అని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. ఎంసీసీ నియమించిన డబ్ల్యూసీసీ (వరల్డ్ క్రికెట్‌ కమిటీ) సభ్యుల్లో గంగూలీ కూడా ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని