Pakistan Cricket: న్యూజిలాండ్ జట్టు వెళ్లిపోవడానికి భారత్ కారణమట! 

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు మ్యాచ్‌లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భారత్‌లో రూపొందిన ఈ మెయిల్ ద్వారానే ఆ జట్టుకు బెదిరింపులు వచ్చాయని పాక్‌ మంత్రి అసత్య ప్రచారం మొదలుపెట్టారు. 

Updated : 09 Dec 2021 16:35 IST

మరోసారి భారత్‌పై విషం గక్కిన పాక్‌

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు మ్యాచ్‌లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భద్రతా కారణాలతో కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకొని న్యూజిలాండ్ స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

2009లో లాహోర్‌లోని గదాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్‌కు అంతర్జాతీయ జట్లు వెళ్లడం మానేశాయి. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ జరుగుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ నిర్ణయంతో దాయాది దేశానికి గట్టి షాక్‌ తగిలింది. అందుకు భారత్‌ కారణమంటూ పాక్‌ తాజాగా ఆరోపణలకు దిగింది. భారత్‌లో జనరేట్ అయిన ఈ మెయిల్ నుంచి ఆ జట్టుకు బెదిరింపులు వచ్చాయని ఆ దేశ ఐటీ శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ నిందారోపణలు చేశారు.

దీనికి సంబంధించి పాక్‌ మంత్రులు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. తెహ్రీక్‌-ఇ-తాలిబన్ పేరిట వచ్చిన నకిలీ పోస్టుతో అసలు వ్యవహారం ప్రారంభమైందన్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందని పాకిస్థాన్‌కు జట్టును పంపొద్దని న్యూజిలాండ్‌ ప్రభుత్వానికి ఆ ట్విటర్ ఖాతా సూచించిందని, ఈ పోస్టు తర్వాత భారత్‌కు చెందిన ఓ పత్రికలో ఉగ్రముప్పుపై వచ్చిన ట్వీట్‌ను ఉటంకిస్తూ కథనం వెలువడిందని పాక్ మంత్రులు ఆరోపించారు. భారత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రికి ఆ మీడియా సంస్థతో సంబంధాలున్నాయన్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ క్రికెటర్ భార్యకు బెదిరింపు మెయిల్ వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఏ సోషల్ మీడియా ఖాతాతో దానికి సంబంధం లేదని, ఒక సెక్యూర్ ఖాతా నుంచి ఆ ఒక్క మెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. దాని పూర్వాపరాలు వెలికితీసేందుకు ఇంటర్‌పోల్ సహకారాన్ని కూడా అభ్యర్థించామన్నారు. అప్పటికీ న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి, ఏ ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్‌ కూడా చేసిందని గుర్తుచేశారు.

అయితే మ్యాచ్‌ మొదటి రోజున తమ జట్టుకు ముప్పు ఉందని చెప్పి, హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయిందని మంత్రులు అన్నారు. బెదిరింపులకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరినప్పటికీ.. చెప్పలేకపోయారన్నారు. తర్వాత రోజు న్యూజిలాండ్ జట్టుకు రెండో బెదిరింపు మెయిల్ వెళ్లిందన్నారు. అది భారతదేశానికి చెందిన పరికరం నుంచి పంపినట్లు గుర్తించామని పేర్కొన్నారు. దాని లొకేషన్ సింగపూర్‌గా చూపిందన్నారు. మొత్తానికి ఈ బెదిరింపులు భారత్ నుంచి జనరేట్ అయ్యాయని మీడియా సమావేశంలో మంత్రులు నిందలు వేశారు. అలాగే డిసెంబర్‌లో పాక్‌లో పర్యటించనున్న వెస్టిండీస్ జట్టుకు కూడా ఇప్పటికే బెదిరింపులు వెళ్లాయని చెప్పారు. న్యూజిలాండ్ జట్టుకు తెలిసిన వివరాలు తమతో పంచుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని