Yuvraj and Gambhir Banter: గౌతీ.. నువ్వు గొడవకు దిగే ప్రతిసారీ అలా చేయాల్సి వచ్చేది: యువీ

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మైదానంలో గొడవకుదిగే ప్రతిసారీ తాను ఆపేవాడినని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. మంగళవారం గంభీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లిద్దరి ఫొటో...

Published : 15 Sep 2021 02:03 IST

(Photo: Gambhir Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మైదానంలో గొడవకుదిగే ప్రతిసారీ తాను ఆపేవాడినని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే మంగళవారం గంభీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లిద్దరి ఫొటో ఒకటి అభిమానులతో పంచుకొని ఇలా రాసుకొచ్చాడు. ‘థాంక్‌ గాడ్‌. మన ఇద్దరి మొహాల్లో చిరునవ్వులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రజలంతా.. నేనేదో కొట్లాడటానికి వెళ్తుంటే నువ్వు నన్ను వెనకనుండి ఆపుతున్నట్టు పొరబడేవారు’ అని పోస్టు చేశాడు.

దీనికి స్పందించిన మాజీ ఛాంపియన్‌ ‘నువ్వు మైదానంలో కొట్లాడటానికి సిద్ధమైన ప్రతిసారి నేను ఇలాగే చేయాల్సి వచ్చేది’ అని సరదాగా కామెంట్‌ చేశాడు. కాగా, గంభీర్‌ టీమ్‌ఇండియాలో ఆడే రోజుల్లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టడమే కాకుండా అప్పుడప్పుడు దూకుడుగా ఉంటూ ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బుదలిచ్చేవాడు. మరీ ముఖ్యంగా ఒకసారి పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీతో సై అంటే సై అనేలా కనిపించాడు. దీంతో అప్పటి నుంచీ వారిద్దరి మధ్య అప్పుడప్పుడు మాటలతూటాలు పేలుతుంటాయి. అలా గంభీర్‌ ఒక్కోసారి తన ప్రశాంతత కోల్పోయేవాడనే ఉద్దేశంలో యువీ సరదాగా కామెంట్‌ చేశాడు.

ఇక వీరిద్దరూ టీమ్‌ఇండియా రెండుసార్లు ప్రపంచకప్‌ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాక్‌తో తలపడిన వేళ గంభీర్‌ (75) పరుగులు సాధించగా.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగులు చేశాడు. దీంతో ఆ రెండు ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించాడు. మరోవైపు యువరాజ్‌ 2007లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లగా.. 2011లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని