CSK vs GT: సీఎస్‌కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్‌’ అతడు!

ఫైనల్‌లో చెన్నై బౌలింగ్‌ను భయాందోళనకు గురిచేసిన చిచ్చరపిడుగు. ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ కూడానూ. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆ బ్యాటర్‌ గుజరాత్‌ జట్టులో ‘ఇంపాక్ట్‌’ చూపిన ఆటగాడు కావడం విశేషం.

Published : 30 May 2023 15:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించింది. ఐదోసారి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓడినప్పటికీ ఆ జట్టు పోరాటం మాత్రం అద్భుతం. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో యువ బ్యాటర్‌ ఆడిన తీరు ప్రశంసనీయం. టైటిల్‌ పోరంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. సీనియర్లే విఫలమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఓ యువ బ్యాటర్‌ అలవోకగా ఆడేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ గుండెల్లో కాస్త అలజడి సృష్టించాడు. ఇంతకీ ఆ యువ బ్యాటర్‌ చెన్నైకే చెందిన వ్యక్తి కావడం గమనార్హం. 

ఎవరీ కుర్రాడు..?

చెన్నైలో 2001లో జన్మించిన సాయి సుదర్శన్‌ చిన్న వయసులోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అతడి తల్లిదండ్రులు ఉషా అలగు, ఆర్‌ భరద్వాజ్‌ క్రీడాకారులు కావడం విశేషం. 2019/20 సీజన్‌లో రాజా ఆఫ్‌ పాలయంపట్టి షీల్డ్‌లో 635 పరుగులు సాధించడంతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో తమిళనాడు తరఫున సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సీజన్‌లో టీ20 అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం కలిగిన సాయి సుదర్శన్ విజయ్‌ హజారే ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

గుజరాత్ అవకాశం ఇలా..

నిలకడైన ఆటతీరుతో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో (TNPL) స్థానం సంపాదించాడు. ఆ లీగ్‌లో 358 పరుగులతో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో గతేడాది మెగా వేలంలో సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్‌ రూ. 20లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లోనే (2022) పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో డెబ్యూ చేశాడు. ఐదు మ్యాచుల్లో 127.19 స్ట్రైక్‌రేట్‌తో 145 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్‌లోనూ మొత్తం 8 మ్యాచుల్లో 362 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌కు తిరుగులేదు. అలాంటిది సుదర్శన్‌ను కీలకమైన మ్యాచుల్లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దింపడం గమనార్హం. దీంతో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ కోసం తొలిసారి వేలం నిర్వహించగా.. లైకా కోవల్ కింగ్స్‌ జట్టు రికార్డు స్థాయిలో సుదర్శన్‌ను రూ. 21.6 లక్షలకు దక్కించుకుంది.

ఈ క్రమంలో కుర్రాళ్లను వెతికిపట్టుకునే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా సాయి సుదర్శన్‌ను తమ జట్టులోకి తీసుకొనేందుకు మొగ్గు చూపొచ్చని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లో ఆటగాళ్ల వేలం ఉండొచ్చని వార్తల నేపథ్యంలో సాయి సుదర్శన్‌ హాట్‌కేక్‌ అవుతాడని పేర్కొన్నారు. ఇలాగే ఓ రెండు సీజన్లలో నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తే భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి.

ఫైనల్‌లో ఇలా ఊచకోత..

తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు సాహా (54), శుభ్‌మన్‌ గిల్ (39) తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. గిల్ ఔటయ్యాక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన సాయి సుదర్శన్ (96:47 బంతుల్లో 8 ఫోర్లు,  6 సిక్స్‌లు) సాహాతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. హాఫ్ సెంచరీ చేయడానికి 33 బంతులను తీసుకున్న సాయి సుదర్శన్‌ ఆ తర్వాత విజృంభించాడు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 14 బంతుల్లోనే మరో 44 పరుగులు జోడించాడు. పతిరణ, దేశ్‌ పాండే బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని