Sachin-Sehwag : నేను సెంచరీ చేయకపోవడమే మంచిది: సచిన్‌

ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత చెన్నై బోణీ కొట్టడంలో...

Published : 15 Apr 2022 01:21 IST

తెందూల్కర్‌ అన్నాడని సెహ్వాగ్‌ వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత చెన్నై బోణీ కొట్టడంలో శివమ్ దూబే కీలక పాత్ర పోషించాడు. బెంగళూరుపై 94 పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి సింగిల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో శతకం చేజార్చుకున్నాడు. అయితే, అతడి బ్యాటింగ్ స్టైల్‌పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం దూబేను అభినందిస్తూ.. సచిన్‌తో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లు ఎవరైనా శతకం చేశాక.. ఆ జట్టు ఓటమిపాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి?’’ ఇలా చాలా సార్లు జరిగిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌ చెప్పిన ఓ విషయాన్ని వీరూ నెమరువేసుకున్నాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్‌ సెంచరీ చేసినా జట్టు ఓడిపోయిన సందర్భాలు ఉన్నట్లు సెహ్వాగ్‌ వివరించాడు. అలానే శతకం చేజారినప్పుడు మ్యాచ్‌లు గెలిచామని తెలిపాడు. ఇది స్వయంగా సచినే తమతో చెప్పినట్లు పేర్కొన్నాడు. ‘‘2011 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్‌ 85 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరగా.. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వస్తున్నప్పుడు సచిన్‌ చిన్నగా నవ్వాడు. అప్పుడు సెంచరీ మిస్‌ అయినందుకు బాధగా లేదా..? అని అడిగితే అతడు చెప్పిన సమాధానం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘నేను సెంచరీ చేయకపోవడమే మంచిది. ఎవరికి తెలుసు.. ఒకవేళ నేను సెంచరీ చేసినా ఓడిపోతే ?’’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు. అక్కడ తన శతకం కంటే మ్యాచ్ విజయం గురించే ఆలోచించాడు’’ అని సెహ్వాగ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని