రోజుకు మూడు బాల్యవివాహాలు!

రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడటం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసినా, కల్యాణలక్ష్మి ఇస్తామని చెబుతున్నా కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చిట్టితల్లులకు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులతో

Published : 20 Jan 2022 04:35 IST

18 ఏళ్లలోపే పెళ్లిపీటలపైకి
కరోనాతో ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబాలు
తల్లిదండ్రుల మాట కాదనలేకపోతున్న బాలికలు
రెండేళ్లలో 2,399 వివాహాలు అడ్డుకున్న శిశు సంక్షేమశాఖ

రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడటం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసినా, కల్యాణలక్ష్మి ఇస్తామని చెబుతున్నా కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చిట్టితల్లులకు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసి, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకి సగటున మూడు చొప్పున రెండేళ్ల వ్యవధిలో 2,399 బాల్యవివాహాలను శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు చేస్తామని కేంద్రం చెబుతున్నా, రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారికి బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి.


ఉన్నత చదువులకు అడ్డుకట్ట...

రోనా మహమ్మారి బాలికల జీవితాలు, ఆశయాలు, ఆకాంక్షలను చిన్నాభిన్నం చేసింది. ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడాలన్న కలలు ఆవిరయ్యాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం, తల్లిదండ్రుల కష్టాలను చూసి, వారి మాట కాదనలేక పెళ్లిపీటలపై కూర్చుంటున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో భారీగా బాల్య వివాహాలు జరిగాయి. ‘‘రాష్ట్రంలోని ఓ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో 480 మంది మహిళలు చదువుకుంటున్నారు. కరోనా కారణంగా డిగ్రీలో చేరిన వెంటనే దాదాపు 80 మందికి వివాహాలయ్యాయి. అప్పటికి వారి వయసు 18 ఏళ్లలోపు. చదువుకుని, సొంతకాళ్లపై జీవితంలో నిలబడాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల మాట కాదనలేక తలొంచారు. తల్లిదండ్రులకు నచ్చచెప్పినా ఒప్పుకోలేదు’’ అని ఆ కళాశాల ఉపాధ్యాయురాలు తెలిపారు. గత ఏడాదికి నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, గద్వాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


అమలు కాని చట్టం...

రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక చట్టం -2006 పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. బాల్యవివాహాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయిలో చైల్డ్‌లైన్‌ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు, బాలల సంరక్షణ కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి లేదా పంచాయతీ కార్యదర్శిని బాధ్యుడిగా నిర్ణయించారు. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది దాడుల భయంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం బాల్య వివాహాలపై అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా లేదా మహిళా సహాయ కేంద్రం 181, పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరు 100  ద్వారా ఎక్కువగా సమాచారం వస్తోంది. ‘‘హైదరాబాద్‌ నాంపల్లిలో ఓ బాలికకు 16 ఏళ్లకే పెళ్లిచేసేందుకు కుటుంబం సిద్ధమైనట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నాం. కొన్నినెలల తరువాత ఆ బాలిక కుటుంబం నాంపల్లి నుంచి సొంతూరు నల్గొండకు వెళ్లి బాలికకు బాల్య వివాహం చేశారు. ఈ విషయం తెలియడంతో నిందితులపై కేసులు నమోదు చేశాం’’ అని హైదరాబాద్‌ శిశుసంక్షేమాధికారి తెలిపారు. దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వివాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని