Published : 12/12/2022 20:28 IST

స్టూడెంట్‌గా వెళ్లి.. ర్యాగింగ్ చేసిన వారిని పట్టించింది..!

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్‌ కాలేజీలో సీనియర్లు.. జూనియర్‌ విద్యార్థులను అభ్యంతరకర రీతిలో ర్యాగింగ్‌ చేశారు. ర్యాగింగ్‌కు గురైన జూనియర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల పేర్లను వెల్లడించలేదు. వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు కాలేజీకి వెళ్లారు. అయితే ఒక్కరు కూడా పేర్లు చెప్పలేదు. దాంతో పోలీసులు రహస్య ఆపరేషన్‌ ద్వారా వారి వివరాలను తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 24 ఏళ్ల యువ కానిస్టేబుల్‌ షాలినీ చౌహాన్‌ ముఖ్య పాత్ర పోషించి, ర్యాంగింగ్‌కు పాల్పడిన వారి వివరాలను చాకచక్యంగా తెలుసుకుంది.

కాలేజీ విద్యార్థిగా..

షాలిని ఇటీవలే ఇండోర్‌లోని సంయోగితగంజ్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరింది. ఆమె తండ్రి కూడా పోలీసే. ఆయన 2010లో చనిపోయారు. మరుసటి ఏడాదే షాలిని తల్లి కూడా మరణించింది. అయినా కుంగిపోకుండా తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని షాలిని కానిస్టేబుల్ అయింది. పోలీస్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొన్ని రోజులకే ఆమె ఈ కాలేజీ ఆపరేషన్‌లో భాగమైంది. ఈ క్రమంలో సాధారణ విద్యార్థినిగా జీన్స్‌, టీ షర్ట్‌ ధరించి బ్యాగ్‌ వేసుకుని రోజూ కాలేజీకి వెళ్లేది. క్యాంటీన్‌, కాలేజీ పరిసర ప్రాంతాల్లో జూనియర్‌ విద్యార్థులతో క్రమంగా పరిచయం పెంచుకుంది. తను కామర్స్‌ విద్యార్థి అయినా ఎవరికీ అనుమానం రాకుండా మెడికల్‌ విద్యార్థులతో మాట్లాడడం మొదలు పెట్టింది. వారి నుంచి విషయాలను రాబట్టేందుకు తనకు సంబంధించిన విషయాలను వారితో పంచుకునేది. దాంతో వారు కూడా వివిధ విషయాల గురించి షాలినితో పంచుకునేవారు. అలా వారు చెప్పిన విషయాల ఆధారంగా ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది సీనియర్‌ విద్యార్థులను పట్టుకోగలిగింది. కాలేజీ యాజమాన్యం ఆ 11 మందిని సస్పెండ్‌ చేసింది. చేపట్టిన మొదటి ఆపరేషన్‌లోనే విజయం సాధించిన ఆమెకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా షాలిని మాట్లాడుతూ ‘నేను నిఘా ఉంచాల్సిన అనుమానిత విద్యార్థుల వివరాలను మా ఆఫీసర్‌ మాకు తెలిపారు. ఇందుకోసం రోజూ ఐదు నుంచి ఆరు గంటల పాటు విరామ సమయాల్లో క్యాంటీన్‌లో తిరిగేదాన్ని. అలా అక్కడ ఉన్నవారితో మాట్లాడడం మొదలుపెట్టాను. అలాగే జూనియర్‌ విద్యార్థులతో పరిచయం పెంచుకున్నాను. అలా నెమ్మదిగా ర్యాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల వివరాలు తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

ఎలాంటి క్లూ లేదు..

ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన పోలీస్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ‘ఈ కేసులో మొదట ఎలాంటి క్లూ లేదు. జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన సంభాషణలు, ర్యాగింగ్‌కు సంబంధించి అజ్ఞాత ఫిర్యాదులు మాకు అందాయి. విచారణ నిమిత్తం కాలేజీకి వెళ్తే భయపడి నిందితుల పేర్లు చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఫోన్‌ నంబర్లను ట్రాక్‌ చేద్దామంటే హెల్ప్‌లైన్‌ పాలసీ సహకరించదు. దాంతో పాత పద్ధతిలో అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేయాలనుకున్నాం. షాలినితో పాటు కొంతమంది కానిస్టేబుల్స్‌ని స్టూడెంట్స్‌గా కాలేజీకి పంపాం. వారు జూనియర్‌ విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ నిందితుల వివరాలను తెలుసుకోగలిగారు’ అని తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి