Updated : 24/03/2023 03:06 IST

తాతయ్య కోసం లైట్లు పంచుతూ..

చీకటి పడితే చాలు. సైకిల్‌కు లైట్లు అమర్చుకోండి అని రాసిన ప్లకార్డు చేతపట్టి రహదారుల పక్కగా నిలబడతోందామె.  లైటు లేని సైకిల్‌పై వెళుతున్న వారిని ఆపి, ఉచితంగా చీకట్లోనూ కనిపించే లైటు అమర్చి జాగ్రత్తలు చెబుతుంది. ఇలా లైట్లను ఉచితంగా అందించి వందలమంది ప్రాణాలు కాపాడుతున్న సామాజిక సేవాకార్యకర్త ఖుషీపాండే ఆ పని ఎందుకు చేస్తుందంటే..

క దిల్లీలోనే ఏటా వెయ్యిమందికిపైగా సైకిల్‌వాలాలు చనిపోతున్నారు. లఖ్‌నవులోని అమీనాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఖుషీపాండే సామాజిక సేవాసంస్థలతో కలిసి ప్రజాసేవలో పాలుపంచుకుంటోంది. శీతాకాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు పేదవారికి దుప్పట్లు, దుస్తుల వితరణ, అలాగే పేదపిల్లలకు విద్యనందేలా కృషి చేస్తోంది. గతేడాది ఖుషీ తాతయ్య సైకిల్‌పై వస్తూ ప్రమాదానికి గురై చనిపోయారు. చీకటిలో ఆయన సైకిల్‌ కనిపించకపోవడంతో కారు ఢీకొట్టింది. ఈ సంఘటన ఖుషీనెంతో బాధించింది. ‘ప్రజా సేవకురాలిగా కళాశాల స్థాయి నుంచి నిరుపేదల కోసం సేవలందిస్తున్న నేను మా తాతయ్యను కాపాడుకోలేకపోయా. ఇలా మరెవరూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోకుండా ఉండాలంటే నావంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. చీకట్లో లైటు లేకుండా ప్రయాణించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలంటే ఆ సైకిళ్లు చీకట్లోనూ అందరికీ కనిపించాలి. అందుకే గతేడాది నుంచి ఉచితంగా సైకిళ్లకు లైట్లు అందించడం ప్రారంభించా. నేనే స్వయంగా లైట్లు అమర్చి పంపుతున్నా. మా వీధుల్లో ప్రతిరోజూ రాత్రుళ్లు ప్లకార్డుతో నిలబడతా. సైకిల్‌పై వెళ్లేవారిని ఆపి లైటు లేకపోతే ఉచితంగా లైటు అమర్చి పంపుతా. అలా ఇప్పటివరకు దాదాపు 1500 లైట్లు అమర్చగలిగా. దీనివల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఇది నాకు సంతోషాన్నిస్తోంది. మా కుటుంబంలా మరెవరూ ప్రియమైన వారిని దూరం చేసుకోకూడదనేది నా లక్ష్యం’ అని చెబుతున్న ఖుషీ అందిస్తున్న సేవ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రముఖులెందరో తమ ప్రశంసలను అందిస్తున్నారు. ప్రమాదాలు అరికట్టడంలో నీవంతు సేవలందిస్తున్నావంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈమె చేస్తున్న సేవ చిన్నదైనా ఫలితం గొప్పదంటూ కితాబిస్తున్నారు. కనీసం ఏటా వెయ్యి మందికిపైగా మరణించకుండా కాపాడుతున్న ఖుషీని మరింతమంది ప్రాణాలను కాపాడాలంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవలను దేశమంతా అందించాలనేదే తన లక్ష్యమంటున్న ఖుషీ తనలాంటి మరెందరికో స్ఫూర్తినిస్తోంది కదూ..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి