Updated : 23/01/2023 14:22 IST

పాతికేళ్ల జడ్జి!

(Photo: Twitter)

ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ, వాటిని సాకారం చేసుకోవడంలో కొంతమంది మాత్రమే సఫలమవుతుంటారు. కర్ణాటకకు చెందిన గాయత్రి ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. నిరుపేద కుటుంబంలో జన్మించినా కష్టపడి న్యాయవిద్యను పూర్తిచేసిందామె. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర న్యాయమూర్తులను చూసి తను కూడా జడ్జి కావాలని కలలు కంది. అందుకోసం అహర్నిశలూ కష్టపడి చదివింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా.. రెండోసారి తను అనుకున్న కలను సాకారం చేసుకుంది. ఈ క్రమంలో 25 ఏళ్లకే న్యాయమూర్తిగా నియమితురాలై.. అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన గాయత్రి కథ నేటి యువతరానికి స్ఫూర్తి!

నిరుపేద కుటుంబం...

గాయత్రి కోలారు జిల్లాలోని కారహళ్లి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నారాయణస్వామి, వెంకట రత్నమ్మ. వారికి గాయత్రి ఏకైక సంతానం. ఆమె తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీ చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలల కందామె. అందుకు తగ్గట్టే ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో చేరినా కష్టపడి చదువుకుంది. కోలారు మహిళా కళాశాలలో బీకాం పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత ‘కెంగల్‌ హనుమంతయ్య లా కళాశాల’లో డిగ్రీ పట్టా అందుకుంది. ఈ క్రమంలో యూనివర్సిటీలోనే 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకుందీ చదువుల తల్లి.

వారిని చూసి...

లా పూర్తి చేసిన తర్వాత గాయత్రి సీనియర్‌ లాయర్‌ శివరామ్‌ సుబ్రహ్మణ్యం దగ్గర అసిస్టెంట్‌ లాయర్‌గా చేరింది. ఆ సమయంలో పలువురు న్యాయమూర్తులను గమనించేది. దాంతో తను కూడా వారిలా జడ్జి కావాలని సంకల్పించుకుంది. ఇదే ఆమె గురువు శివరామ్‌తో చెప్పడంతో.. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. సివిల్‌ న్యాయమూర్తి పరీక్షల కోసం అహర్నిశలూ కష్టపడి చదివింది. 2021లోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూను దాటలేకపోయింది. దాంతో అలుపెరుగని విక్రమార్కునిలా మళ్లీ ప్రయత్నించి.. తాజాగా తన కలను సాకారం చేసుకుంది గాయత్రి. ఇలా పాతికేళ్లకే సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై.. తద్వారా పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన మహిళగా పేరు తెచ్చుకుంది. ఉన్నత లక్ష్యాల్ని అందుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఇలా తన విజయంతోనే నిరూపించిందీ యంగ్‌ జడ్జి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి