Updated : 17/01/2023 00:23 IST

బైక్‌పై భూగోళాన్ని చుట్టేస్తూ..

ప్రపంచమంతా ఒకే కుటుంబం... మనుషులంతా మంచి వాళ్లే అని నిరూపించాలనుకుందామె. అంతేకాదు... దేశ దేశాల పురాణాలు, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కోసం బైక్‌పై ఒంటరిగా భూగోళాన్ని చుట్టేస్తోంది ఎలీనా ఆక్సింటే. లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు చేరుకున్న ఈమె యాత్ర అనుభవాల కథనమిది.

టి, నాటక నైపుణ్యాల శిక్షకురాలు ఎలీనా. ప్రపంచ దేశాల్లో పురాణాలు, ఆయా సంప్రదాయాలన్నీ అనుసంధానమై ఉంటాయని తన నమ్మకం. దీనిపై అవగాహన కోసం వివిధ దేశాల సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుందామె. అందుకోసం దేశాలన్నీ చుట్టాలనే ఆలోచనతో ఆగస్టు, 2019లో బైక్‌పై ఒంటరి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇటలీకి చెందిన ఎలీనా ఈ మూడున్నరేళ్లలో 1.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి కేరళకు చేరుకుంది. ఇప్పటికి 28 దేశాల్లో పర్యటించిన తను గతంలోనూ యాత్రలు చేసింది. ‘ఇంతకు ముందు బైక్‌పై ఒంటరిగానే ఆఫ్రికా దేశాల్లో తిరిగొచ్చా. నా నెట్‌వర్క్‌, సోషల్‌ మీడియా ద్వారా బైకర్స్‌ బృందం అందించే సమాచారంతో ఎక్కడికక్కడ స్థానికుల ఆతిథ్యాన్ని పొందే దాన్ని. హోటల్‌లో గది తీసుకోవల్సిన అవసరం రాలేదు. అక్కడి ప్రజల ఆదరణా మరవలేను. ఆ అనుభవాలను పంచుకొంటున్నప్పుడు వేరే దేశాల్లో ఇలాంటి మర్యాద దక్కడం అసంభవమని అనే వారు చాలా మంది. ఇది నన్ను ఆలోచనలో పడేసింది. ఈ అంశాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని, ప్రపంచమంతా ఒంటరిగా చుట్టాలనుకున్నా. ఎక్కడికెళ్లినా స్థానికుల ఆతిథ్యాన్ని మాత్రమే పొందాలని నియమంగా పెట్టుకున్నా’ అని వివరిస్తుందీమె.


పాండమిక్‌లో..

యూరప్‌ నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఎలీనా టర్కీ, లెబనాన్‌, తదితర దేశాల మీదుగా పశ్చిమ ఆసియాకు చేరుకుంది. కొవిడ్‌ సమయానికి సౌదీ అరేబియాలో ఉంది. ‘ఒక కుటుంబం నాకు నాలుగు నెలలు ఆశ్రయమిచ్చింది. అక్కడ నాకు కరోనా సోకింది. అప్పుడూ వాళ్లు నన్ను హోటల్‌కి వెళ్లమన లేదు. నన్ను కుటుంబ సభ్యురాలిలా, కంటికి రెప్పలా సంరక్షించారు. కొవిడ్‌ నేపథ్యంలో దేశాల సరిహద్దులు దాటడానికి చాలా ఆంక్షలెదురయ్యాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ... అరబ్‌ దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి సంప్రదాయాలన్నీ తెలుసుకొన్నా. మహిళలకు నిబంధనలెక్కువగా ఉంటాయని అందరూ చెప్పే వారు. అయితే నాకే సమస్యలూ ఎదురవలేదు. ఇరాక్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాలు చుట్టాక వాఘా సరిహద్దుల గుండా ఇండియాలోకి ప్రవేశించా. ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో 6 వేల కిలో మీటర్లు ప్రయాణించి ప్రస్తుతం కేరళ చేరుకొన్నా. నేను ప్రయాణించే ప్రతి ప్రాంతంలోనూ స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, పురాణ కథలను తెలుసుకుంటున్నా. వీటన్నింటికీ ఎక్కడో ఒకచోట సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భావన కలుగుతోంది. దాన్నే వెళ్లిన ప్రతి చోటా చాటుతున్నా’ అంటోన్న ఎలీనా హిమాలయాలు, నేపాల్‌, తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకుంటోంది. ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోనూ పర్యటించనున్న 37 ఏళ్ల ఎలీనా ఆశయం, ఆమె అందిస్తోన్న సందేశం స్ఫూర్తిదాయకం కదూ..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి