విలీనానికి రష్యా ‘డ్యూమా’ ఆమోదం

ఉక్రెయిన్‌.. రష్యాకు చెమటలు పట్టిస్తోంది. ఖర్కీవ్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని.. లీమన్‌ నగరాన్నీ హస్తగతం చేసుకున్న ఉక్రెయిన్‌ దళాలు.. ఇప్పుడు ఖేర్సన్‌పై కన్నేశాయి. అక్కడా పుతిన్‌ సేనలను వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతున్నాయి.

Updated : 04 Oct 2022 06:21 IST

ఖేర్సన్‌లోనూ ఉక్రెయిన్‌ దళాల ముందంజ   

కీలక సైనిక కమాండర్‌పై పుతిన్‌ వేటు

కీవ్‌: ఉక్రెయిన్‌.. రష్యాకు చెమటలు పట్టిస్తోంది. ఖర్కీవ్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని.. లీమన్‌ నగరాన్నీ హస్తగతం చేసుకున్న ఉక్రెయిన్‌ దళాలు.. ఇప్పుడు ఖేర్సన్‌పై కన్నేశాయి. అక్కడా పుతిన్‌ సేనలను వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఉక్రెయిన్‌ భూభాగాలైన దొనెట్స్క్‌, లుహాన్స్‌, జపోరిజియాలతో పాటు.. ఈ ఖేర్సన్‌ను కూడా రష్యా సమాఖ్యలోకి చేరుస్తున్నట్లు పుతిన్‌ ఇటీవల సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విలీనానికి సోమవారం ఆ దేశ పార్లమెంటులోని దిగువ సభ డ్యూమా కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఖేర్సన్‌లో ఉక్రెయిన్‌ దళాల దూకుడు రష్యాను కలవరపరుస్తోంది. శత్రువు నెమ్మదిగా ముందంజ వేస్తున్నట్లు అధికారికంగా అంగీకరించింది. మరోవైపు లీమన్‌ నగరం చేజారడంపై ఆగ్రహంగా ఉన్న పుతిన్‌.. కీలక వెస్టర్న్‌ మిలిటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ అలెగ్జాండర్‌ జురొవ్‌లోవ్‌పై వేటు వేశారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. 

విలీనం సరే.. హద్దులు ఎక్కడ?

ఉక్రెయిన్‌ భూభాగాలను విలీనం చేస్తూ మాస్కో అట్టహాసంగా చేసిన విలీన ప్రక్రియపై రష్యాలోనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పేరుకు విలీనమైతే చేశారు గానీ.. జపోరిజియా, ఖేర్సన్ల సరిహద్దులెక్కడో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక నివాసులతో చర్చించి హద్దులను ఖరారు చేస్తామని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలపడం గమనార్హం.


అణువిద్యుత్కేంద్ర అధిపతిని వదిలేశారు

రష్యన్లు తాము నిర్బంధంలోకి తీసుకున్న జపోరిజియా అణు విద్యుత్కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌ ఇహోర్‌ మురాషోవ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ధ్రువీకరించింది. మురాషోవ్‌ సురక్షితంగా తన కుటుంబసభ్యులను చేరుకున్నారని ఐఏఈఏ అధిపతి రఫెల్‌ గ్రాసీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని