
గ్రేటర్ హైదరాబాద్
తిరుపతిగారిపల్లె వద్ద తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులతో అమరావతి రైతుల వాగ్వాదం
గూడూరు, న్యూస్టుడే: అమరావతి రైతుల మహాపాదయాత్ర సందర్భంగా పోలీసులు, పాదయాత్రికుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తున్నప్పుడు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆ సమయంలో పోలీసులు రెండువైపులా వాహనాలను వదలడం, మద్దతు తెలిపేందుకు వచ్చిన వారికి ఆంక్షలు విధించి, కట్టడి చేసేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు తమతో పలుమార్లు అనుచితంగా మాట్లాడారని, వేలు చూపించి బెదిరించారని రాజధాని మహిళలు సైతం ఆరోపించారు. అదే సమయంలో పాదయాత్రికులకు రక్షణగా వస్తున్న తనను సీఐ మోచేత్తో డొక్కలో పొడిచారంటూ శివ అనే బౌన్సర్ సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రైతులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. తిరుపతిగారిపల్లిలోనూ పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రైవేటు స్థలంలో సభ: 17న తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ హాజరవుతారని అమరావతి పరిరక్షణ సమితి ఐక్య వేదిక కన్వీనరు శివారెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు ఎన్టీఆర్ స్టేడియం ఇవ్వడానికి ఎస్వీయూ అంగీకరించలేదు. సమితి తరఫున ప్రతినిధులు ఎస్వీయూ ఉపకులపతిని ఇటీవల కలిసి లేఖ అందజేశారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదనే సంకేతాలు ఎస్వీయూ నుంచి రావడంతో... ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించడానికి ఉద్యమకారులు సన్నాహాలు చేస్తున్నారు. నాయుడుపేట-పూతలపట్టు రహదారిలో తిరుపతి సమీపంలోని టయోటా షోరూం పక్కన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు.