
ఉల్లికి మద్దతు ధర, రాయితీ విత్తనాలు లేవు
తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన భూములున్నా అన్నదాతకు ప్రోత్సాహం కరవు
ఫలితంగా అధిక ధరతో అల్లాడుతున్న జనం
ఈనాడు - హైదరాబాద్
ఉల్లి.. కొనాలంటే ప్రజలకు, పండించాలంటే రైతులకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కిలో రూ.100కు చేరడంతో పండగల సీజన్లో జనం ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు. సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట పండించడానికి అన్నదాతలు ముందుకు రావడం లేదు. పండించినా.. కొనడానికి మార్కెటింగ్ వ్యవస్థ లేదు. నిల్వ చేయడానికి తెలంగాణ, ఏపీలలో సరైన గోదాములు లేవు. ఫలితంగా కర్ణాటక, మహారాష్ట్రలలో పండిన ఉల్లిగడ్డలే దిక్కవుతున్నాయి. నాసిక్ నుంచి తెలంగాణతోపాటు ఏపీలోని విజయవాడ దాకా నిత్యం లారీల కొద్ది ఉల్లి వస్తోంది. అలా రాకుంటే ప్రస్తుతం ఉల్లిగడ్డలు దొరకని పరిస్థితి ఏర్పడింది.
* ప్రస్తుత ఖరీఫ్(వానాకాలం)లో దేశవ్యాప్తంగా 43 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని తొలి అంచనా. కానీ, భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో 37 లక్షల టన్నులకు మించి రాదని తెలిసి వ్యాపారులు నిల్వలను బయటికి రానీయడం లేదు. బాగా తేమ వల్ల దిగుబడి నాణ్యత సరిగా లేదు. దీంతో నాణ్యమైన గడ్డల ధర రూ.100కి చేరింది.
* తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పంటను వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) రెండు సీజన్లలోనూ పండిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు కర్నూలు, కడప వంటి చోట్ల ఖరీఫ్లో వేసిన పంట బాగా వస్తుంది. నిజామాబాద్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత తెల్ల ఉల్లిగడ్డ సాగుచేయడం ఆనవాయితీ.
* ఈ పంట సాగుకు తేలికపాటి నేలలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు రాయలసీమలో తేలికపాటి నేలలున్నాయి. నీరు నిలవని.. ఇసుక, తేలికరకం నేలలున్న ప్రాంతాల్లో ఉల్లిగడ్డ బాగా పెద్దగా పెరిగి ఎకరానికి 150 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. కానీ, ఆయాచోట్ల పండినా నిల్వ చేసే సదుపాయాలు లేవంటూ రైతులు ఉత్సాహం చూపడం లేదు.
* రాయలసీమలో సాధారణ ఉల్లితోపాటు అధికంగా పండే కేపీ ఉల్లిగడ్డలకు అరబ్ దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. తెలంగాణలో పండే ఉల్లిగడ్డలను దుబాయ్ తదితర దేశాలు అడుగుతున్నాయి. కానీ, ఇక్కడే సరిగా సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి.
సాగు వ్యయం బోలెడు
ఉల్లి పంట సాగు వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఎకరాలో సాగుచేయాలంటే రూ.60 వేల దాకా రైతులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యాన శాఖ అధ్యయనంలో తేలింది.
కనీసం కిలో రూ.10కి అయినా కొంటేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఉల్లి సంకరజాతి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు కిలో గరిష్ఠంగా 2 వేల దాకా అమ్ముతున్నాయి. గతంలో తెలంగాణలో ఎకరానికి అవసరమైన విత్తనాలపై ఉద్యానశాఖ రూ.600 దాకా రాయితీ ఇచ్చేది. కానీ, గత మూడేళ్లుగా అది ఆపేశారు.
ఒక గిడ్డంగికి ఇచ్చే రాయితీతో 25 వేల ఎకరాలకు..
ఒక శీతల గిడ్డంగి కట్టేవారికి రూ.1.40 కోట్ల దాకా రాయితీని ఉద్యాన శాఖ ఇస్తోంది. ఆ రాయితీని ఆపి ఉల్లి విత్తనాలపై ఇస్తే ఏకంగా 25 వేల ఎకరాల్లో పంట సాగు చేయించడానికి అవకాశముంటుందని ఉద్యాన శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. సాగు విస్తీర్ణం పెంపునకు సరైన ప్రణాళిక, గిడ్డంగులు, మద్దతు ధర లేకపోవడం ఉల్లి కొరతకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఉదాహరణకు 2019 సెప్టెంబరు, అక్టోబరులలో హైదరాబాద్లో కిలో ధర రూ.50 దాటింది. ఈ సారి మార్చి నుంచే లాక్డౌన్ ఉన్నందున మళ్లీ అదే సమయానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయని ముందే అధికార వర్గాలు అంచనా వేశాయి. అయినా, పంట సాగు, దిగుబడి పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందునే ఇప్పుడు రూ.100కి ప్రజలు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల్లో పంట విస్తీర్ణం బాగా పెరగనంతకాలం ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.
వ్యాపారుల ఇష్టారాజ్యం
కేంద్రం ఏటా మద్దతు ధర ప్రకటించే 24 పంటల జాబితాలో ఉల్లి లేదు. ఈ పంటను ఎంతకు కొనాలనేది వ్యాపారుల ఇష్టానికే వదిలేశారు. బాగా పండినప్పుడు కిలో రూ.5కు కూడా కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. అన్నదాతలు అమ్మేసుకున్నాక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరను పైపైకి తీసుకెళ్తున్నారు. ఉదాహరణకు.. పంటను కోసి మార్కెట్లకు తీసుకెళ్లినా గిట్టుబాటు కాదని కర్నూలు ప్రాంతంలో ఉల్లి తోటలను రైతులు అలాగే వదిలేసిన ఘటన 2 నెలల క్రితం చోటుచేసుకుంది. ఇప్పుడేమో ధరలు అమాంతం పెరిగాయి.
మరిన్ని

దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ద్వివేది, గిరిజా శంకర్పై ఎస్ఈసీ చర్యలు
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- దిల్లీలో టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!