
తాజా వార్తలు
విశాఖలో కొనసాగుతున్న కూల్చివేతలు..
భీమిలి గ్రామీణం: విశాఖలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. భీమిలి బీచ్రోడ్లో మంగమూరిపేట కూడలి వద్ద ఉన్న హబ్ ఫర్ యూత్.. గో కార్టింగ్ రేస్లో నిర్మాణాలను శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. జీవీఎంసీ డీసీపీ రాంబాబు నేతృత్వంలో అక్కడికి చేరుకున్న సిబ్బంది ప్రొక్లెయిన్తో రేకుల షెడ్డులను ధ్వంసం చేయించారు. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోడలు, షెడ్డులు తొలగించారు. సీఆర్జెడ్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించినందు వల్లే తొలగించామని డీసీపీ తెలిపారు.
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలు తొలగించారని గో కార్టింగ్ నిర్వాహకులు, ఆనంద్ అసోసియేట్స్ అధినేత కాశీవిశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని, ఎలాంటి శాశ్వత భవనాలు కట్టకుండా నిర్వహిస్తున్నప్పటికీ రూ.3 కోట్ల విలువైన వినోద, క్రీడా సామగ్రిని జీవీఎంసీ సిబ్బంది ధ్వంసం చేశారని వెల్లడించారు.