పిలుస్తోంది నౌకాదళం!

బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలతో భారతీయ నౌకాదళంలో కొలువుదీరే అవకాశం వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో 242 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

Published : 04 May 2023 00:32 IST

నేవీ అధికారులుగా అవకాశం

బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలతో భారతీయ నౌకాదళంలో కొలువుదీరే అవకాశం వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో 242 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటికి అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారిని శిక్షణలోకి తీసుకుంటారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ పొందవచ్చు!

ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌ల్లో ఉన్నాయి. ఇవన్నీ లెవెల్‌-10 హోదా ఉద్యోగాలే. వీటికి పరీక్ష నిర్వహించకపోవడం అదనపు ఆకర్షణ. అకడమిక్‌ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. అందువల్ల యూజీ/పీజీలో ఎక్కువ మార్కులు పొందినవారు విజయవంతం కావడానికి అవకాశాలెక్కువ. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు. ఇవి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తుది నియామకానికి ఖరారు చేస్తారు.

వీరికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2024 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం పొందవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులు పరిమిత కాల ప్రాతిపదికన (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) ఉంటాయి. ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. అందువల్ల గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగవచ్చు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి వైదొలగాలి.
వయసు: పోస్టు ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2, 1999 - జనవరి 1, 2003/2004/2005 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  
పై అన్ని పోస్టులకూ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ ఉన్నవారికి అకడమిక్‌ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ తమ ప్రాధాన్యం ఎంచుకోవడం తప్పనిసరి.


ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు?

* ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: జనరల్‌ సర్వీస్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 15 మహిళలకు కేటాయించారు. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 10, నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ 20, పైలట్‌ 25 ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్‌ 30 ఖాళీలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్‌/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. ఈ విభాగంలో 6 పోస్టులు మహిళలకు దక్కుతాయి. నేవల్‌ ఆర్మమెంట్‌ విభాగంలో 15 ఖాళీలున్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌, పది, ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
* ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి 12 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు.
* టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ 20, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ 60 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 14
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్‌, విశాఖపట్నం, కోల్‌కతా. పైలట్‌, అబ్జర్వర్‌ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని