మేటి సంస్థల్లో ఎంసీఏ

కంప్యూటర్‌ కోర్సులకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యమున్న సంస్థలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లే. వీటిలో పలు పాతతరం సంస్థలు ఎంసీఏ కోర్సు అందిస్తున్నాయి.

Published : 14 Mar 2024 00:04 IST

కంప్యూటర్‌ కోర్సులకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యమున్న సంస్థలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లే. వీటిలో పలు పాతతరం సంస్థలు ఎంసీఏ కోర్సు అందిస్తున్నాయి. ఇవన్నీ ఉమ్మడిగా ఎన్‌ఐటీ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌) నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్ష స్కోరుతో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పలు ఇతర పేరున్న సంస్థల్లోనూ ఎంసీఏ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో నిమ్‌సెట్‌- 2024 వివరాలు..

సాఫ్ట్‌వేర్‌, ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే సాధారణ గ్రాడ్యుయేట్లకు నిమ్‌సెట్‌ మంచి అవకాశం. ఈ పరీక్ష స్కోరుతో వరంగల్‌ సహా, పది ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సు చదువుకోవచ్చు. దేశీయ, బహుళ జాతి ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్‌ అనుసరిస్తాయి. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే వరంగల్‌, జంషెడ్‌పుర్‌ నిట్‌లు రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. రెండేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తున్నాయి. ఈ ఏడాది పరీక్షను నిట్‌, జంషెడ్‌పుర్‌ నిర్వహిస్తోంది.
అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా కనీసం మూడేళ్ల యూజీ కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం) తప్పనిసరి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.
ఎన్నెన్ని సీట్లు: అగర్తలా-30, అలహాబాద్‌-116, భోపాల్‌-115, జంషెడ్‌పుర్‌-115, కురుక్షేత్ర-96 (వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌-110, సూరత్కల్‌-58, తిరుచురాపల్లి-115, వరంగల్‌- 58, పట్నా-160 (వీటిలో 80 డేటాసైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌, మరో 80 ఏఐ అండ్‌ ఐవోటీ స్పెషలైజేషన్‌తో అందిస్తున్నారు. ఒక్కో విభాగంలోనూ 40 సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తారు). ఈ విద్యా సంవత్సరం నుంచి త్రిపుల్‌ ఐటీ భోపాల్‌ నిమ్‌సెట్‌తోనే 60 ఎంసీఏ సీట్లు భర్తీ చేస్తుంది. ఈ 11 సంస్థల్లోని 1033 సీట్లు నిమ్‌సెట్‌ కౌన్సెలింగ్‌తోనే నింపుతారు.


నిమ్‌సెట్‌తో అవకాశం

పరీక్ష ఇలా

పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలకు 70 నిమిషాలు కేటాయించారు. అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 20, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలడుగుతారు. ఈ రెండు విభాగాలకూ 20 నిమిషాలు. పరీక్షకు వెయ్యి మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం తగ్గిస్తారు.
మార్కుల కేటాయింపు: మ్యాథ్స్‌లో ప్రతి సరైన జవాబుకీ 12 మార్కులు. తప్పు సమాధానానికి 3 మార్కులు తగ్గిస్తారు. అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ల్లో సరైన జవాబుకు 6 మార్కులు. తప్పైతే 1.5 మార్కులు తగ్గిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌లో సరైన సమాధానానికి 4 మార్కులు. జవాబు తప్పైతే ఒక మార్కు తగ్గిస్తారు. మ్యాథ్స్‌కు 600, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 240, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 120, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 మార్కులకు ఉంటాయి.

మేటి స్కోరు కోసం..

  • మ్యాథ్స్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఇందులో ఎక్కువ స్కోరు సాధించినవారు పోటీలో ముందుంటారు.
  • ఈ విభాగంలో ప్రశ్నలన్నీ రెండేళ్ల ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి.
  • సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఆల్జీబ్రా, కో ఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్‌, వెక్టార్స్‌, ట్రిగనోమెట్రీ అంశాలపైనే ప్రశ్నపత్రం ఉంటుంది.
  • వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మెరుగైన స్కోరు సాధ్యమవుతుంది.
  • ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది.
  • అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ విభాగానికి ఐసెట్‌ స్థాయిలో చదువుకోవాలి.
  • కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు బీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పాఠ్యాంశాలను బాగా చదవాలి.
  • జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నలూ ఐసెట్‌ స్థాయిలోనే ఉంటాయి.

కౌన్సెలింగ్‌

మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌తో 11 సంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. సంస్థలవారీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల కోటా వర్తించదు.
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ సీట్లన్నీ నిమ్‌సెట్‌తోనే భర్తీ అవుతాయి. అయితే ఆ సంస్థలో సీటు ఆశిస్తున్నవారు ప్రకటన వెలువడినప్పుడు నిమ్‌సెట్‌ స్కోరుతో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దేశంలో ఎంసీఏ కోర్సు అందిస్తోన్న ప్రముఖ సంస్థలెన్నో నిమ్‌సెట్‌ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి.


ముఖ్య తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్‌ 20 సాయంత్రం 5 గంటల వరకు.
పరీక్ష: జూన్‌ 8
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500
వెబ్‌సైట్‌:http://www.nimcet.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు