TS Exam 2022: అంతా ఆపదలమయం!

దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు నష్టపోతున్నారు. మనుషులు తమ మనుగడ కోసం పర్యావరణ వనరులను మితిమీరి

Updated : 01 Aug 2022 02:37 IST

జనరల్‌ స్టడీస్‌

విపత్తు నిర్వహణ

దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు నష్టపోతున్నారు. మనుషులు తమ మనుగడ కోసం పర్యావరణ వనరులను మితిమీరి వినియోగించుకోవడమూ వైపరీత్యాలకు దారితీస్తోంది. ఆ ఆపదలు ఎన్ని రకాలు? వాటికి కారణాలు ఏమిటి? ఏవిధమైన నష్టాలు సంభవిస్తున్నాయి? తదితర అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

భారతదేశంలో విపత్తులు

విభిన్న భౌగోళిక, శీతోష్ణ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా భారతదేశం పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవకారక విపత్తులను ఎదుర్కొంటోంది. వీటికి తోడు అధిక జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ పద్ధతుల ఆచరణ లాంటి కారణాలు కూడా విపత్తుల దుర్బలత్వాన్ని పెంచుతున్నాయి. మన దేశంలో విపత్తులు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం దేశ భౌగోళిక నిర్మాణం.

భౌగోళిక దుర్బలత్వం

విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి భారతదేశాన్ని అయిదు ప్రత్యేక ప్రాంతాలుగా విభజించారు.

హిమాలయ ప్రాంతం: భారతీయ భూపటల పలక, యూరేషియన్‌ భూపటల పలక కిందకు క్రియాశీలకంగా, భూఅంతర్భాగంలో ప్రవేశిస్తుండటం వల్ల అతి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి తూర్పున మయన్మార్‌ సరిహద్దు వరకూ భూకంపాలు, వాటికి సంబంధించిన భూపాతాలు (శిలలు విరిగి పడటం) తరచుగా జరుగుతున్నాయి. అంతే కాకుండా హిమాలయాల్లో అధిక వర్షాల కారణంగా నేల కోతకు గురవుతోంది.

ఉత్తర మైదానం: ఇది హిమాలయ ప్రాంతానికి పక్కనే ఉన్నందున భౌగోళికంగా విరూపకారక లక్షణాలు (ఖండ పలకల చలనాలు) కలిగి భూకంపాలు, భూపాతాలు ఏర్పడుతున్నాయి. నైరుతీ రుతుపవన కాలంలో విపరీతమైన వరదలు సంభవిస్తాయి. దాంతో నేల క్రమక్షయానికి గురవుతోంది.

ద్వీపకల్ప పీఠభూమి: ఈ ప్రాంతాన్ని వివిధ రకాల కొండలతో విస్తరించి స్థిరమైన భూభాగంగా పరిగణిస్తున్నప్పటికీ ఒక మోస్తరు భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే కొండల వెనుక ప్రదేశాల్లో వర్షం తక్కువగా ఉండి వర్షచ్ఛాయా ప్రాంతాలుగా మిగిలిపోయి కరవు కాటకాలు ఏర్పడుతున్నాయి.

ఉదా: రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలు.

తీరప్రాంత మండలం: భారతదేశానికి దీవులతో సహా మొత్తం 7,516 కిలోమీటర్ల తీరం ఉంది. ఇందులో 76 శాతం అంటే 5,700 కి.మీ. తీరం తుపాన్లు, సునామీలకు ఎక్కువగా గురవుతోంది. ఏటా తీర ప్రాంతం నదీ ముఖద్వారాల వద్ద (నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు) వరదలు సంభవిస్తున్నాయి.

ఎడారి ప్రాంతం: ఇక్కడ అల్ప నుంచి అత్యల్ప వర్షం నమోదు కావడం వల్ల ప్రతి సంవత్సరం కరవు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గిపోయి విపత్కర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ విధంగా భారతదేశ సహజ సిద్ధమైన భౌగోళిక నిర్మాణమే వివిధ విపత్తుల దుర్బలత్వానికి ప్రధాన కారణంగా ఉంది.

శీతోష్ణ దుర్బలత్వం

దేశంలో వార్షిక వర్షపాతంలో సుమారు 75 శాతం వర్షం కేవలం నైరుతి రుతుపవనాల (జూన్‌ - సెప్టెంబరు నెలల్లో) కాలంలోనే కురుస్తుంది. ప్రతి ఏడెనిమిదేళ్లకు దేశంలో తీవ్ర కరవు సంభవిస్తుంది. 1980 - 2010 మధ్యలో నాలుగుసార్లు కరవు కాటకాలు వచ్చాయి. 1876-78ల్లో దక్షిణ భారతదేశంలో మహాదుర్భిక్షం, 1896-97లో దేశంలో దుర్భిక్షం సంభవించాయి (కరవు అధిక కాలం కొనసాగి, ఎక్కువ మందిపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని     దుర్భిక్షంగా పేర్కొంటారు).
దేశంలో వర్షపాత వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రాంలో ఏటా 1,187 సెం.మీ. ఉంటే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 12 సెం.మీ. మాత్రమే ఉంటుంది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో అధిక వర్షాల వల్ల గంగా, బ్రహ్మపుత్రా నదీ మైదానాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవిస్తున్నాయి.

సామాజిక, ఆర్థిక దుర్బలత్వం

పేదలు తమ మనుగడ కోసం అనివార్య పరిస్థితుల్లో పర్యావరణ వనరులను ఉపయోగించుకోవడం వల్ల వరదలు, కరవు, భూపాతం లాంటి విపత్తుల తీవ్రత ఎక్కువవుతోంది. సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండా తక్కువ వ్యయంతో కూడిన సామగ్రితో నిర్మించిన గృహాలు సులభంగా విపత్తులకు గురై మరింత సామాజిక వెనుకబాటుకు దారితీస్తోంది. ఉదా: 2001-11 మధ్య వరదలు, చక్రవాతాలు, భూకంపాలు, భూపాతాల వల్ల సుమారుగా 1,50,23,870 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరణ: ఈ సంస్థ నిర్వహిస్తున్న ఇండియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ ప్రకారం దేశంలోని 22 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలను అధిక విపత్తులకు గురయ్యేవిగా    గుర్తించారు.

దేశంలోని 68 శాతం సాగు భూమిలో కరవు ఏర్పడుతోంది. మొత్తం భూభాగంలో 58.6 శాతం భూకంపాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

దేశం మొత్తం భూమిలో 12 శాతం భూభాగం వరదలు, 8 శాతం చక్రవాతాలు, 0.15 శాతం భూపాతాలు కలిగే అవకాశం ఉంది.

భారతదేశంపై ప్రపంచ బ్యాంకు వివరణ: భారతదేశ అభివృద్ధి మార్గానికి సహజ విపత్తులు  ఒక ప్రధాన అవరోధంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

దేశంలో సహజ విపత్తుల వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం నష్టం ఏర్పడుతోంది.

విపత్తుల వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం, ప్రమాద వైపరీత్యాల వల్ల జీడీపీలో 3 శాతం నష్టం వాటిల్లుతోంది.

యునైటెడ్‌ నేషన్స్‌ డిజాస్టర్స్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌) ప్రివెన్షన్‌ వెబ్‌ ప్రకారం భారతదేశంలో 1980-2010 మధ్య సంభవించిన సహజ విపత్తులు, వాటి ప్రభావాలు కింది విధంగా ఉన్నాయి.

విపత్తు ఘటనల సంఖ్య - 431

మృతులు - 1,43,039 మంది

ప్రభావిత ప్రజలు - 152,17,26,127 మంది.

https://tinyurl.com/2p837ysj


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని