Postal Jobs: తపాలా శాఖలో కొలువుల జాతర.. మరో 30 వేల పోస్టులకు భారీ నోటిఫికేషన్‌

Postal GDS Job notification: తపాలా శాఖలో మళ్లీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 03 Aug 2023 15:30 IST

దిల్లీ: తపాలా శాఖ(Indian Post)లో ఈ ఏడాది కొలువుల జాతర కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో 40వేలకు పైగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన తపాలాశాఖ.. మే నెలలో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) పోస్టుల కోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 23వరకు ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి 26వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించారు.

పరీక్ష లేదు.. వేతనం ఎంతంటే?

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM)/ డాక్‌సేవక్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు అధికారులు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అలాగే,అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్‌ సేవక్‌కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో భర్తీచేసే ఉద్యోగాలెన్ని?

మొత్తం 30,041 పోస్టులకు గాను ఏపీలో 1058, తెలంగాణలో 961 చొప్పున భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే,  వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తారు.  వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని