RGUKT AP: ఆర్జీయూకేటీ- ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ

RGUKT-IIIT applications | ఏపీలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Published : 08 May 2024 15:54 IST

అమరావతి: ఏపీలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో రెండేళ్ల పీయూసీ- నాలుగేళ్ల బీటెక్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీల్లో  2024-25 విద్యా సంవత్సరానికి మే 8 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. పదో తరగతి పాసై, ఆసక్తి కలిగిన విద్యార్థులు జూన్‌ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారూ దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులే.

దరఖాస్తుల కోసం క్లిక్‌చేయండి

  • నాలుగు క్యాంపస్‌లలో కలిపి మొత్తంగా 4వేల సీట్లు భర్తీ చేయనున్నారు.  మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు తెలంగాణ విద్యార్థులు సైతం పోటీపడతారు.
  • దరఖాస్తు రుసుం రూ.300. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

  • పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం మార్కులు కలుపుతారు. రెండేళ్ల పీయూసీ అనంతరం విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తారు. 
  • ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తొలుత గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
  • అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో క్యాంపస్‌లను కేటాయిస్తారు. అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్‌ ప్రాధాన్యాలను జాగ్రత్తగా సూచించాలి. ఒకసారి క్యాంపస్‌ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే విద్యనభ్యసించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల ప్రొవిజినల్‌ జాబితాలను జులై 11న ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్జీయూకేటీ తెలిపింది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు