పులుపుతో పండగ చేస్కుందాం!

పుల్లగా నోరూరించే మామిడి రాక మొదలవుతూనే ఇళ్లల్లో రుచుల సందడి కూడా ఆరంభమవుతుంది. ఇప్పటికే పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైనా ఎండ నుంచి రక్షించే షర్‌బత్‌లూ, నాన్‌వెజ్‌తో దోస్తీచేసే కూరలు బోలెడు చేసుకోవచ్చు.

Updated : 19 Mar 2023 05:53 IST

పుల్లగా నోరూరించే మామిడి రాక మొదలవుతూనే ఇళ్లల్లో రుచుల సందడి కూడా ఆరంభమవుతుంది. ఇప్పటికే పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైనా ఎండ నుంచి రక్షించే షర్‌బత్‌లూ, నాన్‌వెజ్‌తో దోస్తీచేసే కూరలు బోలెడు చేసుకోవచ్చు. అవేంటో చూడండి. మీరూ ప్రయత్నించండి..


తురుము పచ్చడి

కావాల్సినవి: మామిడి కాయలు- 3, ఆవాలు- చెంచా, మెంతులు- చెంచా, పసుపు- అర చెంచా, నూనె- 200 గ్రా, వెల్లుల్లి- పది రెబ్బలు, ఎండుమిర్చి- 5, ఉప్పు- అర కప్పు, కారం- ముప్పావు కప్పు, కరివేపాకు- కొద్దిగా ఇంగువ- చిటికెడు.

తయారీ: మామిడికాయలు శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడిచి తొక్క తీసేసి, తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు కడాయిలో వేసి స్టౌపై చిన్నమంటమీద ఉంచి దోరగా వేయించుకోవాలి. అవి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని తడిలేకుండా చూసుకుని అందులో మామిడికాయ తురుము, ఉప్పు, కారం, మిక్సీ పట్టిన ఆవాల పొడి ఒక టేబుల్‌ స్పూను, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో నూనెవేసి అది వేడయ్యాక తాలింపులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న తురుమును మిశ్రమంలో వేసి కలపాలి. తడిలేని గాజు సీసాలో భద్రపరుచుకుంటే మూడునెలల వరకూ నిల్వ ఉంటుంది.


మామిడికాయ బోటీ..

కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, బోటీ- అరకేజి, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, అల్లంవెల్లుల్లి మిశ్రమం- రెండు చెంచాలు, ఉప్పు, కారం- తగినంత, గరంమసాల- అరచెంచా, ధనియాలపొడి- చెంచా, జీలకర్రపొడి- అరచెంచా, పసుపు- కొద్దిగా, పచ్చిమిర్చి- మూడు, సన్నగా తురుమిన కొత్తిమీర- చెంచాన్నర, నూనె- తాలింపులోకి సరిపడా.

తయారీ: బోటీని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బోటీలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూనె కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. దీంట్లో బోటీ, పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టుకొని ఆవిరిపైనే కొంచెం సమయం మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బోటీ పూర్తిగా ఉడికాక దీంట్లో పొట్టు తీసి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాల వేసి మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసుకొని స్టౌ కట్టేయాలి. అంతేనండీ బోటీ మామిడికాయ రెడీ.


రొయ్యలతో

కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, రొయ్యలు- అరకేజీ, ఉల్లిపాయ- అరకప్పు, అల్లంవెల్లుల్లి మిశ్రమం- రెండు చెంచాలు, ఉప్పు, కారం- తగినంత, గరంమసాల- అర చెంచా, ధనియాలపొడి- చెంచా, జీలకర్రపొడి- అరచెంచా, పసుపు- కొద్దిగా, పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- తాలింపులోకి సరిపడా.

తయారీ: మామిడికాయని చెక్కుతీసి కడిగి, ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. రొయ్యలు పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. రొయ్యల్లో పసుపు, ఉప్పు వేసి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని స్టౌ మీద బాండీ పెట్టి ఒక చెంచా నూనె వేసి అందులో వెయ్యాలి. రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇంకి పోయేదాకా ఉంచాలి. తాలింపుకోసం బాండీలో నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి మగ్గాక అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసి, పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో రొయ్యలు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాల వేసి పది నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆఖరున కొత్తిమీర వేసి దింపేసుకోవటమే. అదిరిపోయే రొయ్యలకూర తయార్‌.


మిరియాల చారు..

కావాల్సినవి: మీడియమ్‌ సైజు మామిడికాయ- ఒకటి, కందిపప్పు- పావుకప్పు, ఉప్పు- తగినంత, మిరియాలు- చెంచా, పసుపు- చిటికెడు, మెంతులు- అరచెంచా, జీలకర్ర- చెంచా, వెల్లులి రెబ్బలు- అయిదు, ఆవాలు- కొద్దిగా, కరివేపాకు- కొద్దిగా, ఇంగువ- చిటికెడు, నూనె, ఎండుమిర్చి- తాలింపులోకి సరిపడా

తయారీ: మామిడికాయకు చాకుతో గాట్లుపెట్టి ఒక గిన్నెలో ఉంచి దాంట్లో సగం వరకూ నీళ్లు పోయాలి. స్టౌ మీద సిమ్‌లో ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ చల్లారాక పొట్టు తీసేసి గుజ్టుని చేత్తో మెత్తగా మెదపాలి. కడాయిలో మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. తాలింపు వేయడానికి పాత్ర పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లులి, రెండు ఎండుమిర్చి, వేసి అవి వేగాక కరివేపాకు, ఇంగువ వెయ్యాలి. దీంట్లో మెదిపి పెట్టుకున్న పప్పు, మామిడికాయ గుజ్జు, తగినన్ని నీళ్లు, పసుపు వేసి బాగా కలపాలి. ఎండుమిర్చి, మిరియాల పొడి వేసి మూత పెట్టుకొని పది నిమిషాలు మరిగించాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్‌చేసుకుంటే సరి.


షరబత్‌

కావాల్సినవి: పచ్చిమామిడికాయ ముక్కలు- కప్పు, పంచదార- ఒకటిన్నర కప్పు, ఉప్పు- చిటికెడు, నల్ల ఉప్పు- చిటికెడు, జీలకర్ర పొడి- చిటికెడు, పుదీనా- కొద్దిగా, ఐస్‌క్యూబ్స్‌ తగినన్ని

తయారీ: ముందుగా మామడికాయ చెక్కు తీసేసి ముక్కలు చేసుకుని, పంచదార, కప్పు నీళ్లు పోసి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకూ పొయ్యి మీద ఉంచి మరిగించాలి. స్టౌ కట్టేసి, చల్లారాక ఆ ముక్కలని మాత్రమే మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్టుని మళ్లీ పంచదార పాకంలో వేసి.. నల్లఉప్పు, జీలకర్రపొడి వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల పాటు మరిగించాక దాన్ని వడకట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక గ్లాసులో పావు వంతు మామిడికాయ జ్యూస్‌కి మిగిలినవి నీళ్లు పోసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌, పుదీనా వేసుకుంటే షరబత్‌ తయారైపోతుంది. ఇది ఎక్కువ మోతాదులో చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని కావల్సినప్పుడు దాంట్లో తగినన్ని నీళ్లు కలిపి సర్‌్్వ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని