మహదేవుని సన్నిధిలో బంగారు ఏనుగులు

కేరళలోని ఆలయాలు సంప్రదాయత, ప్రాచీన ఆచారాలు, వైవిధ్యమైన శిల్పకళకు తార్కాణంగా నిలుస్తాయి. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధి, నిక్షేపాలు ఎంతటి సంచలనం

Updated : 14 Mar 2023 15:05 IST

కేరళలోని ఆలయాలు సంప్రదాయత, ప్రాచీన ఆచారాలు, వైవిధ్యమైన శిల్పకళకు తార్కాణంగా నిలుస్తాయి. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధి, నిక్షేపాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. నాటి పాలకులు భగవంతునికి దాసులుగా ఉంటూ ప్రజాకంజకంగా పాలించేవారు.పాలకులుగా ఆధిపత్యం చలాయించేవారుకాదు. కేరళ కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూర్‌లో పరమేశ్వరుడు మహదేవునిగా భక్తులకు దర్శనమిస్తాడు. కుఢ్యచిత్రాలకు ఈ ఆలయం ప్రసిద్ధి. పాండవులు, వ్యాసమహర్షి ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్టు పురాణాగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.మళయాళంలో మనూర్‌ అంటే జింకల సమూహం. ఒకప్పుడు జింకలు ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో ఎట్టుమనూర్‌ అని పేరువచ్చింది.

స్థలపురాణం..

ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఖార అనే రాక్షసుడు ఈశ్వరభక్తుడు. ఘోర తపస్సు చేసి ఆ శంభుని నుంచి మూడు శివలింగాలను పొందుతాడు. వీటిని తీసుకువెళ్లే సమయంలో ఒకటిని పళ్లతో ఉంచుకొని మిగిలిన వాటిని రెండు చేతులతో పట్టుకుంటాడు. అనంతరం వరుసగా కడుతురుత్తి, వైకొం, ఎట్టుమనూర్‌లో ప్రతిష్టిస్తాడు. తరువాత జింక అవతారం దాల్చి ఎట్టుమనూర్‌లో స్వామి సేవలో తరిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన లయకారకుడు జింక రూపంలో ఉన్న ఖారుడిని ఎత్తుకొంటాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుని కోసం కైలాసం నుంచి విచ్చేసిన ప్రదేశం కావడంతో ఎట్టుమనూర్‌ దివ్యక్షేత్రంగా శోభిల్లుతోంది.

బంగారు ఏనుగుల విగ్రహాలు...

మహదేవునికి ట్రావన్‌కూర్‌ రాజ్య స్థాపకుడు తిరునాళ్‌ మార్తాండవర్మ బంగారుతో చేసిన ఎనిమిది ఏనుగుల విగ్రహాలను కానుకలుగా సమర్పించారు. వీటిలో ఏడు ఏనుగుల విగ్రహాలు రెండు అడుగుల ఎత్తుఉంటాయి. మరో ఏనుగు ఒక్క అడుగు ఎత్తులో ఉంటుంది. అందుకనే వీటిని ఎళారా పొన్నన అంటారు. మళయాళంలో ఎళారా అంటే ఏడున్నర అని అర్థం. పొన్నన అంటే బంగారు ఏనుగు అని. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో వీటిని ప్రదర్శస్తారు. మళయాళం నెల కుంభం ( ఫిబ్రవరి-మార్చి)లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ఎనిమిది, పదోరోజున బంగారు ఏనుగులతో ఊరేగింపు జరుపుతారు. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఏనుగులతో పాటు బంగారు ఏనుగుల విగ్రహాలను భక్తుల సందర్శనకు తీసుకువస్తారు.

ఆలయ శిల్పకళ..

ఆలయాన్ని కేరళ వాస్తురీతికి అనుగుణంగా నిర్మించారు. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో వేల దీపాలను వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. వేలదీపాల వెలుగులో మహదేవుని మందిరం భూలోక కైలాసాన్ని తలపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గోడలపై వేసిన చిత్రాలు అందర్ని అలరిస్తాయి. శివతాండవం చేస్తున్న చిత్రం అద్భుతంగా ఉంటుంది.ధ్వజస్తంభంపై వృషభమూర్తి బొమ్మను వీక్షించవచ్చు. ఆలయ ప్రాంగణంలో గణపతి, భగవతి, యక్షి... తదితర ఉపమందిరాలున్నాయి.

ఎలా చేరుకోవాలి..

రైల్వేస్టేషన్‌: కొట్టాయం నుంచి 11 కి.మీ. దూరంలో ఉంది. కొట్టాయం చేరుకొని ఆటోలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు.
రోడ్డుమార్గం: దేశంలోని అన్నిప్రాంతాలనుంచి కొట్టాయంకు రోడ్డు మార్గముంది.విమానాశ్రయం: కొచ్చిలోని విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి వాహనాల్లో చేరుకోవచ్చు. దూరం 77 కి.మీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని