యాదాద్రి

యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రం. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కొలువై ఉందీ ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు...

Updated : 14 Mar 2023 17:39 IST

యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రం. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కొలువై ఉందీ ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.

క్షేత్ర మహిమ/ స్థల పురాణం: శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందన్నది ఐతిహ్యం. సింహం ఆకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసే తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడట! ఆ మేరకు ఇక్కడ ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడిగా నిత్యపూజలు అందుకొంటున్నాడు. గ్రహ పీడితులు, మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఆంజనేయస్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.

త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థలపురాణం. జ్వాలా నరసింహుడు, యోగా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శమిచ్చిన స్వామి.. లోకకల్యాణార్థం మీరు ఈ రూపాల్లో.. ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరికపై ఇక్కడే ఉండిపోయారట!

దర్శనవేళలు

✺ ఉదయం 4 గంటలకు ఆలయం తెరుస్తారు.
✺ ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ. 100, రూ. 150 టికెట్లపై ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది.
✺ ఒక ప్రత్యేక దర్శనం టికెట్‌పై ఒకరినే అనుమతిస్తారు. క్యూలైన్‌లోనే ఈ ప్రత్యేక టికెట్లను విక్రయిస్తారు.
✺ మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు విరామం
✺ ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టికెట్‌ రూ. 500, అర్చన రూ. 216, సువర్ణ పుష్పార్చన రూ. 516
✺ త్వరలో ఆన్‌లైన్‌లో పూజ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

పరిసరాలు..

ఉపాలయాల విశేషాలు: యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని మాత సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం.. ఈ రెండు ఆలయాల్లోనూ నిత్యపూజలు కొనసాగుతుండటం విశేషం!

ప్రధాన పూజల వివరాలివి..

ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కల్యాణోత్సవం, అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.

ఆర్జిత సేవల వివరాలు

❉ ఆలయంలో నిత్యం జరిగే శ్రీ లక్ష్మీ నరసింహుల నిత్య కల్యాణం టికెట్టు ధర రూ. 1,250
❉ శుక్రవారం అమ్మవారి ఉత్సవ సేవ టికెట్టు ధర రూ. 750
❉ ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, టికెట్‌ధర రూ. 216
❉ ప్రతి ఏకాదశి రోజున లక్ష తులసి పుష్పార్చన, టికెట్‌ ధర రూ.5,116
❉ స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకం, టికెట్‌ ధర రూ. 750
❉ కొండపైనే ఉన్న శివాలయంలో లక్షబిల్వార్చన టికెట్టు ధర. రూ. 250.
❉ శనివారం నవగ్రహ పూజలు, సోమవారం రుద్రాభిషేకం, కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి రూ. 250
❉ నవగ్రహ పూజకు రూ. 116, రుద్రాభిషేకం కోసం రూ. 116 టికెట్లను ఖరీదు చేయాలి.

వసతి సౌకర్యాలు.. 

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొండపై వసతిగదులు, కాటేజీలు ఉన్నాయి. రుసుము రూ. 200 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది. దేవస్థానం కాటేజీలు విచారణ కోసం ఫోన్‌: 08685- 236623, 236645 నంబర్లలో సంప్రదించవచ్చు.

రవాణా సౌకర్యం: 

హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు నల్గొండ నుంచి.. హైదరాబాద్‌- ఎంజీబీఎస్‌ నుంచి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. జేబీఎస్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు చొప్పున టీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సుల సౌకర్యమూ ఉంది. దగ్గరలోని విమానాశ్రయం.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయమే!

యాదగిరిగుట్టలోని ప్రైవేటు లాడ్జిల సమాచారం

వెంకటేశ్వర లాడ్జి ఫోన్‌: 81252 69331
వెంకటాద్రి లాడ్జి ఫోన్‌: 08685- 236455
భూలక్ష్మి లాడ్జి ఫోన్‌: 08685-236999
శివలాడ్జి ఫోన్‌: 92900 63755
మహేశ్వరీ లాడ్జి ఫోన్‌: 92900 63755
భవ్య ఫంక్షన్‌ హాలు లాడ్జి ఫోన్‌: 92472 87901


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని