సిద్ధివినాయక మందిరం:ముంబయి

జగన్మాత పార్వతీదేవి ముద్దుల తనయుడు బాలగణేశుడు. ఆ స్వామిని పూజ చేయందే ఎటువంటి శుభకార్యాలను ప్రారంభించలేమన్న సంగతి తెలిసిందే. మహాకాయుడైన ఆ విఘ్నేశ్వరుడు ముంబయిలో శ్రీ సిద్ధివినాయకుడిగా విశేషపూజలను అందుకుంటున్నారు. చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ...

Updated : 09 Aug 2023 09:31 IST

జగన్మాత పార్వతీదేవి ముద్దుల తనయుడు బాలగణేశుడు. ఆ స్వామిని పూజ చేయందే ఎటువంటి శుభకార్యాలను ప్రారంభించలేమన్న సంగతి తెలిసిందే. మహాకాయుడైన ఆ విఘ్నేశ్వరుడు ముంబయిలో శ్రీ సిద్ధివినాయకుడిగా విశేషపూజలను అందుకుంటున్నారు. చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా మారడం లంబోదరుని మహిమ అని భక్తులు విశ్వసిస్తారు.

నవశాల గణపతి

ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో ఈ మందిరం నెలకొనివుంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్‌కు చెందిన ద్యూబయి పాటిల్‌ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్‌ లక్ష్మణ్‌వితు పాటిల్‌ నిర్మించారు. ద్యూబాయి పాటిల్‌కు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభుకుమారుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్ధివినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చేవాడని మరాఠీ భాషలో దీనర్థం.

సిద్ధి,బుద్ధిల సమేతంగా

స్వామివారు సిద్ధి, బుద్ధిల సమేతంగా భక్తులకు అభయాన్ని ఇస్తుంటారు. పైన చేతిలో గొడ్డలి, మరో చేతిలో తామర, కింద వున్న చేతుల్లో జపమాల, మోదక్‌లు ధరించి భక్తులకు కనువిందు చేస్తుంటారు. రోజు వేలాదిమంది భక్తులు బొజ్జగణపయ్య దర్శనం కోసం వస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా వుంటుంది.

ఆదాయంలోను మేటి

సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఆదాయాన్ని పలు సాంఘికసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

బాలీవుడ్‌ తారల ఇష్టదైవం

సిద్ధివినాయకుడిని సామాన్యులతో పాటు పలువురు బాలీవుడ్‌ తారలు తరచుగా దర్శించుకుంటారు. అమితాబ్‌బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సల్మాన్‌ఖాన్‌, దీపికా పదుకొనె... తదితర తారలు స్వామివారిని దర్శించే భక్తుల్లో కొందరు కావడం విశేషం.

ఎలా చేరుకోవచ్చు

ముంబయి భారతదేశానికి ఆర్థిక రాజధాని కావడంతో దేశం నలుమూలల నుంచి ఈ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని