అష్ట వినాయక దర్శనం

జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలను చేకూర్చుతుంది. పంచారామ క్షేత్రాలను...

Updated : 14 Mar 2023 19:09 IST

జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలను చేకూర్చుతుంది. పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఒక్కరోజులో కష్టం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రెండు రోజుల్లో అన్ని చోట్లకూ వెళ్లొచ్చు.

బల్లాలేశ్వరుడు

పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. అష్ట క్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలసిన స్వామి ఈయనే. బల్లాల్‌ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత.

వరద వినాయకుడు

మహడ్‌ క్షేత్రంలో స్వామి వరద వినాయకుడు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే రుషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కణ్నుంచి వెళ్లిపోగా అదే అదనుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. ఆ ఆ కలయిక వల్ల గృత్సమధుడు అనే పిల్లవాడు పుట్టాడు. పెరిగి పెద్దయ్యాక తన పుట్టుక రహస్యం తెలుసుకున్న ఆ కుర్రవాడు.. అందరి పాపాలూ తొలగిపోవాలని వినాయకుణ్ని ప్రార్థించాడట. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చి అక్కడే స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామి ఆలయంలో గర్భగుడిలోని దీపం గత వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు స్థానికులు.

చింతామణి గణపతి

షోలాపూర్‌ పుణె మార్గంలో ఉండే థేవూర్‌ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోర్కెలు తీర్చే ‘చింతామణి’ అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు.. కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చింతామణి సాయంతో యువరాజుకూ అతని పరివారానికీ అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట ఆ మహర్షి. ఆ వింతకు ఆశ్చర్యపోయిన యువరాజు కపిలమహామునిని ఏమార్చి చింతామణిని అపహరించాడు. అప్పుడు కపిలుడు వినాయకుని ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడనీ.. గణరాజును చంపి ఆ మణిని తెచ్చిచ్చిన గణపతి ‘చింతామణి గణపతి’గా ప్రసిద్ధి చెందాడనీ స్థలపురాణం. ఆ యుద్ధం ఒక కబంధ వృక్షం వద్ద జరగడం వల్ల ఈ వూరిని కబంధతీర్థం అని కూడా అంటారు.

మయూరేశ్వరుడు

పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్‌గావ్‌ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకోనివుండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. తన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఆ కథేంటంటే.. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధివసించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్‌, మోరేశ్వర్‌ అని పిలుస్తారు. అనురసంహారం గావించిన స్వామి కాబట్టి.. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు.

సిద్ధి వినాయకుడు

పూర్వం మధుకైటభులనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సాయం అర్థించాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యాడట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టించిన బలం, వేగం, ఉత్సహాలతో రాక్షసులను మట్టుబెట్టాడు. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభువుగా భావించే స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలున్నారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.

మహాగణపతి

సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్‌గావ్‌ వినాయకుడు మహాగణపతి. పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడుగా మారితే శివుడు అతడితో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. అప్పుడు నారదమహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాథుణ్ని పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు హరుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ని తలచుకుని విజృంభించి త్రిపురాసురుణ్ని మట్టుబెట్టాడట. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతోంది.

విఘ్న వినాయకుడు

ఓఝూర్‌ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నాసురుడనే రాక్షసుడు విధ్వంసం సృష్టించేవాడట. మునుల జపతపాదులకు భంగం కలిగించేవాడట. అతని బాధ భరించలేక మునులు వినాయకుడిని ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో యుద్ధానికి దిగాడు. రణం మొదలైన కొద్దిసేపటిలోనే... తాను గణేశుడి మందు నిలబడలేనని గ్రహించిన విఘ్నాసురుడు ఆ స్వామికి లొంగిపోయాడట. తన పేరు మీద విఘ్నేశ్వరుడిగా అక్కడే కొలువుండాలని కోరాడట. అలా వెలిసిన విఘ్నేశ్వరుడికి ఆలయం కట్టించారు అక్కడి మునులు ఇదీ ఓఝూర్‌ స్థలపురాణం.

గిరిజాత్మజ వినాయకుడు

గిరిజాత్మజుడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం. ఈ స్వామి దర్శనం చాలా కష్టం. ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. పైకి 238 మెట్లుంటాయి. పిల్లలూ, వయసులో ఉన్నవారూ చురుగ్గా ఎక్కొచ్చుగానీ.. పెద్దవాళ్లకు కష్టమే. అలాంటివారి కోసం డోలీ ఏర్పాట్లు కూడా ఉన్నాయక్కడ. పుత్రుడి కోసం పార్వతీదేవి పన్నెండేళ్లు తపమోనర్చిన ప్రదేశం లేన్యాద్రి పుణ్యక్షేత్రం. అనంతర కాలంలో అమ్మచేతి నలుగుపిండి నుంచి రూపుదిద్దుకున్నాడు బాలగణపతి. తర్వాత కౌమారప్రాయం వచ్చే దాకా తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని ఐతిహ్యం. నలుగు పిండితో ఒక విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో చిత్రంగా ఉంటుందిక్కడి విగ్రహం.

ప్రారంభించిన చోటికే.. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ క్షేత్రాల్లో ఎక్కణ్నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్లీ అక్కడికి తిరిగిరావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు యాత్రామార్గం ఆద్యంతం పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది.

ఎలా చేరుకోవాలి

* మహారాష్ట్రలోని పుణె నగరం చేరుకొని అక్కడ నుంచి అష్టవినాయక యాత్ర ప్రారంభించవచ్చు.
* పుణెకుల దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి.
* ఈ క్షేత్రాలకు కార్లలో వెళ్లలేని వారి కోసం మహారాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముంబై షోలాపూర్‌ నగరాల నుంచి అష్టవినాయక క్షేత్రదర్శనం స్పెషల్‌ ప్యాకేజీ బస్సులు ఉంటాయి. రుసుము కూడా తక్కువే


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని