తీర్థ ప్రభ

తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ముందు వెనకలు కలిపి, ఇది మూడు రోజుల పండుగ. ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యం కలిగిన పర్వదినాలివి. అందుకే ‘పెద్ద పండుగ’ అనీ పిలుస్తారు. భోగి అనగానే- వాడవాడలా వేసే మంటలు, చిన్నపిల్లలకు పోసే భోగిపళ్లు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువులు

Updated : 14 Mar 2023 19:02 IST

తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ముందు వెనకలు కలిపి, ఇది మూడు రోజుల పండుగ. ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యం కలిగిన పర్వదినాలివి. అందుకే ‘పెద్ద పండుగ’ అనీ పిలుస్తారు. భోగి అనగానే- వాడవాడలా వేసే మంటలు, చిన్నపిల్లలకు పోసే భోగిపళ్లు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువులు గుర్తుకొస్తాయి. వ్యవసాయదారుల పండుగ కనుమ. సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కోనసీమకే ప్రత్యేకమైన ‘ప్రభల తీర్థం’ ఒకటి. కోనసీమలో సంక్రాంతినాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది- జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు.

పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని భావిస్తారు. వారు: వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు, కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు, ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు, వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు, నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి. అలాగే ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు, మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు, పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు, గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు. వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి- ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేల మధ్య నుంచి వూరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి, ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి- రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు. భక్తిభావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. ఇలాంటి సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక భావనలతో పాటు సామాజిక ప్రయోజనాలూ భాసిస్తాయి!

- అయ్యగారి శ్రీనివాసరావు

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని