5 లక్షల కోట్లకు అప్పు!

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 Aug 2021 02:35 IST

రాష్ట్రం నెత్తిన మోయలేనంత రుణభారం
కార్పొరేషన్ల అప్పే రూ. 1.35 లక్షల కోట్లు
మిగిలినవి రూ.4 లక్షల కోట్లకు చేరువలో
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ అప్పుల మొత్తం పెరుగుతోంది. పీడీ ఖాతాల్లో ఉంచిన మొత్తాన్నీ ప్రభుత్వ అప్పుగానే లెక్కించాలి. ప్రభుత్వం వివిధ రూపాల్లో రుణాలు సేకరిస్తుంది. వీటిని బడ్జెట్‌ ద్వారా చేసే ఖర్చులకు వినియోగిస్తుంది. అదే సమయంలో కార్పొరేషన్లకు ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చి అప్పులు తీసుకుని తన అవసరాలకే వినియోగించుకుంటున్నా ఆ మొత్తాలను రుణాల్లో కలిపి చూపించడం లేదు. ఆ కార్పొరేషన్లు చేసే రుణాన్నీ ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా చెల్లిస్తోంది. కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు లేకుండానే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ రుణాల భారం పడేది ప్రభుత్వం పైనే. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.4లక్షల కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ అప్పునకు కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన మరో రూ.1,35,600 కోట్లు కలిపి చూడాలని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ అప్పు రూ.5.35 లక్షల కోట్ల మొత్తానికి చేరుకుంటున్నట్లే భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.

ప్రభుత్వం బడ్జెట్‌ లెక్కల్లో పేర్కొన్న ప్రకారం రాష్ట్ర అప్పు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3,55,974.30 కోట్లకు చేరింది. అంతకుముందు అంచనాల్లో అది 3.48 లక్షల కోట్లే. లెక్కలు సవరించే నాటికి ఇది ఎంత లేదన్నా మరో 8-10వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాల విశ్లేషణ. దీనికితోడు పీడీ ఖాతాల ద్వారా ఇప్పటికీ చెల్లించని భారం కలిపితే ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లే లెక్క కడుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు మినహాయిస్తే మిగిలిన అప్పులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3.87 లక్షల కోట్లకు చేరుకుంటాయని ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం 4 లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కార్పొరేషన్ల అప్పులు లక్ష కోట్ల పైనే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇంతవరకు రూ.1,35,600 కోట్ల రుణం తీసుకున్నట్లు లెక్కలు కడుతున్నారు.

*రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లకు ప్రభుత్వాలు రూ.1,19,230 కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చాయి. వాటి నుంచి రూ.1,13,000 కోట్లు ప్రభుత్వాలు ఇప్పటికే రుణంగా తీసుకున్నాయని విశ్లేషకుల లెక్క. ఆ అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల కోసం తెచ్చినవే.
* మరోవైపు ఇటీవల ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. భవిష్యత్తు ఆదాయాలు ఎస్క్రో చేసి రూ.21,500 కోట్ల రుణం తీసుకున్నారు. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం విధించి, ఆ మొత్తాన్ని రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు మళ్లించి అక్కడి నుంచి పది డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేస్తున్నారు. ఈ నిధులు సంక్షేమ పథకాలకే వినియోగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
* ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి పెట్రోలు, డీజిల్‌పై రూపాయి సెస్‌ విధించి రూ.1,100 కోట్లు రుణంగా తీసుకుంది.
*ఈ రుణాలన్నింటి విలువ రూ.1,35,600 కోట్లుగా తేలుతోంది. ఈ అప్పుల చెల్లింపు రాష్ట్ర బడ్జెట్‌ నుంచే జరుగుతున్నందున ఇది రాష్ట్రప్రభుత్వ అప్పుగానే చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు. కేరళ ప్రభుత్వం ఇలాగే అదనపు సెస్‌లను ఎస్క్రో చేసి తీసుకున్న రుణాన్ని రాష్ట్ర అప్పుగానే పరిగణించాలని అక్కడి కాగ్‌ పేర్కొన్న అంశమూ తాజాగా చర్చనీయాంశమవుతోంది.

ఇలాగైతే సగం రాబడి అప్పుల చెల్లింపులకే

కార్పొరేషన్ల రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో నిధులిస్తోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ కార్పొరేషన్లు ఏవీ సొంత వ్యాపారాలతో నిధులు సృష్టించుకోవని, అందువల్లే వాటి రుణాల బాధ్యతను ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా అప్పులు పరిమితికి మించి పెరిగితే రాబడిలో సగానికి పైగా మొత్తం అప్పులు చెల్లించేందుకు వినియోగించే రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని