కదిలిన చక్కెర ఫ్యాక్టరీ రుణాల డొంక

పన్నెండేళ్ల క్రితం వెలుగు చూసిన చక్కెర కర్మాగారం బ్యాంకు రుణాల కుంభకోణంపై ఎట్టకేలకు ఇప్పటికి స్పష్టత వస్తోంది. సంక్షోభంలో ఉన్న పరిశ్రమను...

Published : 06 Dec 2021 03:51 IST

రూ.వందల కోట్ల మోసంపై కొలిక్కి వస్తున్న విచారణ

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: పన్నెండేళ్ల క్రితం వెలుగు చూసిన చక్కెర కర్మాగారం బ్యాంకు రుణాల కుంభకోణంపై ఎట్టకేలకు ఇప్పటికి స్పష్టత వస్తోంది. సంక్షోభంలో ఉన్న పరిశ్రమను గట్టెక్కించాలన్న కారణం చూపించి రైతుల పేర్లతో బ్యాంకుల నుంచి రూ.300 కోట్లను దారి మళ్లించిన వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమైంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రైతులకు తెలియకుండానే ఫ్యాక్టరీ యాజమాన్యం, బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పాల్పడిన ఈ కుంభకోణంలో చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీఐడీ అధికారులు కొద్ది రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. వివరాలు ఇలా..పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులోని జైపూర్‌ షుగర్స్‌ ఆధ్వర్యంలో వీవీఎస్‌ షుగర్స్‌ పేరుతో ఓ సంస్థ నడిచేది. ఆ సంస్థ ప్రతినిధులు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొందరు అధికారులతో కలిసి అప్పట్లో రైతుల పేరున బ్యాంకు నుంచి సదరు సంస్థ నిర్వహణకు అవసరమైన ధనాన్ని దొడ్డిదారిన తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పలువురు చెరకు రైతుల పేరుతో ఆయా ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి రుణంగా రూ.300 కోట్లు వీవీఎస్‌ షుగర్స్‌ ఖాతాలోకి మళ్లించినట్లు అభియోగం.

కుంభకోణంలో 66 మంది...

ఈ విషయం 2009లో రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన కొందరు రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అనంతరం 2013లో మరో కేసు కూడా దీనిపై నమోదై సీఐడీ విచారణ మొదలు పెట్టింది. ఆ క్రమంలో గత 4నెలలుగా ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ సీఐడీ విభాగం అధికారులు విచారణ వేెగవంతం చేసి కుంభకోణంలో 66 మందిని నిందితులుగా గుర్తించారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించి 24 మందిని గుర్తించగా... అందులో ఇద్దరు మృతి చెందారు. ఫ్యాక్టరీకి సంబంధించి 36 మంది అధికారులు, సిబ్బంది, యాజమాన్య సభ్యుల్లో మరో ఎనిమిది మందిని గుర్తించి విచారించారు. వీరిపై ఛార్జిషీటు ఫైల్‌ చేసి ఏలూరు, కాకినాడ కోర్టుల్లో హాజరుపరిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని