AP news: జగన్‌పై ఎత్తేసిన కేసులివే

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో నమోదైన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తప్పుడు (ఫాల్స్‌) కేసులంటూ కొన్నింటిని, మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ అంటూ మరికొన్నింటిని,

Updated : 24 Jun 2021 09:28 IST

హైకోర్టు సుమోటో విచారణ నేపథ్యంలో చర్చనీయాంశం
ఈనాడు - అమరావతి

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో నమోదైన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తప్పుడు (ఫాల్స్‌) కేసులంటూ కొన్నింటిని, మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ అంటూ మరికొన్నింటిని, మిస్టేక్‌ ఆఫ్‌ లా, ఆధారాలు లేవనే కారణంతో ఇంకొన్నింటిని ఎత్తేసింది. ఆయా కేసుల దర్యాప్తు అధికారులు న్యాయస్థానాల్లో క్లోజర్‌ రిపోర్టులు దాఖలు చేసి వాటి కథ ముగించారు. చర్యల ఉపసంహరణ (యాక్షన్‌ డ్రాప్డ్‌) పేరిట పలు కేసుల్ని న్యాయస్థానాల్లో విచారణ అవసరం లేకుండా మూసేశారు. గతేడాది సెప్టెంబరు 16 తర్వాత వరుసగా ఈ కేసుల ఎత్తివేత వ్యవహారం సాగింది. దర్యాప్తు అధికారులు సంబంధిత డీఎస్పీల నుంచి అనుమతి తీసుకుని.. తర్వాత న్యాయస్థానంలో క్లోజర్‌ రిపోర్టులు దాఖలుచేసి వాటికి స్వస్తి పలికారు. అలా ఎత్తేసిన 11 కేసులపై హైకోర్టు బుధవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ కేసుల వివరాలివీ..

పోలీసుస్టేషన్‌: మంగళగిరి గ్రామీణం
నమోదైన తేదీ: 2016 మార్చి 9
ఫిర్యాదు సారాంశం: వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శత్రుత్వం పెంచేలా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఫిర్యాదుదారులు: ఎ.వెంకటేశ్వరరావు, తోట ముసలయ్య, వై.భాగ్యారావు, కర్రి ప్రభాకర్‌రావు, ఆర్‌.సాంబశివరావు, డి.వీరాంజనేయులు
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసులు అని న్యాయస్థానానికి నివేదిక సమర్పించి ఎత్తేశారు.


పోలీసుస్టేషన్‌: నల్లచెరువు (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 5
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘చంద్రబాబు నాయుడిని చచ్చేవరకూ చెప్పులతో కొట్టండి’ అంటూ ప్రసంగించి ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: దాడెం వెంకటశివారెడ్డి (కమ్మవారిపాలెం గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్‌ ఆఫ్‌ లా


పోలీసుస్టేషన్‌: యాడికి (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా యాడికిలో 2016 జూన్‌ 3న జరిగిన రైతు భరోసా యాత్రలో ప్రసంగిస్తూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతకర భాషను ఉపయోగించారు. ఆయన గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: వేలేరు రంగయ్య (టి.కొత్తపల్లి గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్‌ డ్రాప్డ్‌ (చర్యల ఉపసంహరణ)


పోలీసుస్టేషన్‌: పెదవడగూరు(అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం క్రిష్టపాడులో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్‌ అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారు. పెదవడగూరు మండలంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారు.
ఫిర్యాదుదారు:కొండూరు కేశవరెడ్డి (కొండూరు గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్‌ డ్రాప్డ్‌ (చర్యల ఉపసంహరణ)


పోలీసుస్టేషన్‌: అనంతపురం రెండో పట్టణం
నమోదైన తేదీ: 2016 జూన్‌ 6
ఫిర్యాదు సారాంశం: అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో 2016 జూన్‌ 5న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు.
ఫిర్యాదుదారు: తమ్మినేని పవన్‌కుమార్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ల్యాక్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ (ఆధారాలు లేవు)


పోలీసుస్టేషన్‌: పుట్టపర్తి అర్బన్‌ (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు.
ఫిర్యాదుదారు: బోయ రామాంజనేయులు (బ్రాహ్మణపల్లి గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: -


ఎత్తేసిన కేసుల్లో హైకోర్టు సుమోటో విచారణ పరిధిలో లేనివీ మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు..

పోలీసుస్టేషన్‌: పులివెందుల (కడప జిల్లా)
నమోదైన తేదీ: 2011 అక్టోబరు 9
ఫిర్యాదు సారాంశం: అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వోద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించి నేరపూరిత బలప్రయోగం చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, అక్రమ చొరబాటు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్న ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వై.అన్నయ్య
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు


పోలీసుస్టేషన్‌: చిలకలూరిపేట టౌన్‌
నమోదైన తేదీ: 2015 జూన్‌ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్‌ఫోన్‌ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: గొర్రపాటి వెంకట హనుమ శివప్రసాద్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు


పోలీసుస్టేషన్‌: నరసరావుపేట ఒకటో పట్టణం
నమోదైన తేదీ: 2015 జూన్‌ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్‌ఫోన్‌ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వేల్పుల సింహాద్రి యాదవ్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు


పోలీసుస్టేషన్‌: నందిగామ (కృష్ణా జిల్లా)
నమోదైన తేదీ: 2017 ఫిబ్రవరి 28
ఫిర్యాదు సారాంశం: 2017 ఫిబ్రవరి 28 కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. ఆరి మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్న సమయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు శవపరీక్ష గదిలోకి చొరబడి వైద్యాధికారిణిని అడ్డుకున్నారని, ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారన్న ఫిర్యాదులు.
ఫిర్యాదుదారు: కేవీ లక్ష్మీకుమారి (వైద్యురాలు)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని