పెద్ద తలకాయలను పట్టుకోరా?

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్‌) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది.

Updated : 28 Nov 2021 02:55 IST

మాదకద్రవ్యాల కేసుల్లో డ్రైవర్లు, క్లీనర్లే నిందితులా?
దర్యాప్తు తీరుపైనా సందేహం కలుగుతోంది
జస్టిస్‌ లలిత కీలక తీర్పు

ఈనాడు, అమరావతి: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్‌) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ఇది దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తునకు ‘ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేయాలన్నారు. డీజీపీ క్రమం తప్పకుండా ప్రత్యేక విభాగంతో సమీక్షించాలని స్పష్టంచేసింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో(పీపీ) సైతం సంప్రదింపులు చేస్తుండాలంది. ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగవుతున్నట్లు కనిపిస్తోందని, ఇది చట్టవిరుద్ధమనే విషయం స్థానికులకు తెలియదని వ్యాఖ్యానించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు అవగాహన శిబిరాలతో ఛైతన్య పరచాలని ఆదేశించింది. ఎన్‌డీపీఎస్‌ కింద నమోదైన కేసుల్లో పోలీసులు, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులు, పీపీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. సంబంధిత ప్రతి హైకోర్టు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట పోలీసులు ఎన్‌డీపీఎస్‌ కింద నమోదు చేసిన కేసులో నిందితులైన లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు బెయిలు మంజూరు చేశారు.

గడువు పొడిగింపునకు అభ్యర్థించకపోవడంపై ఆక్షేపణ
ఎన్‌డీపీస్‌ కింద నమోదైన కేసుల్లో 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయకుంటే నిందితులకు డిఫాల్ట్‌ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఒకవేళ 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయలేనప్పుడు.. నిందితుల రిమాండ్‌ సమయాన్ని పొడిగించాలని పోలీసులు సంబంధిత కోర్టులో పోలీసులు దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుపట్టారు.

డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా...
నిందితుల రిమాండ్‌ సమయం పొడిగింపుపై దిగువ కోర్టుల్లో దరఖాస్తులు చేయడం లేదనే విషయాన్ని న్యాయస్థానం ఉత్తర్వుల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ కౌంటర్‌ దాఖలు చేస్తూ.. ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తు విషయమై సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేశామన్నారు. నిందితుల రిమాండ్‌ను పొడిగించాల్సినవి విజయనగరంలో 8, విశాఖ జిల్లాలో 44  కేసులున్నాయన్నారు. సమయం పొడిగింపునకు కోర్టులో మెమోలు వేశామన్నారు. 2020లో విశాఖ జిల్లాలో 252, 2021లో 248 ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయన్నారు.

ఇవీ న్యాయమూర్తి ఇచ్చిన మార్గదర్శకాలు...
*  కేసు మూలాలను కనుగొనలేక కొన్నింట్లో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోతున్నారు. కేసు నమోదైన తర్వాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తిచేయాలి.
*   సోదాలు, జప్తుల సమయంలో అధికారులు ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనలను, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలి.
*  నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని పోలీసు అధికారులు కోరినా తగిన సమయంలో స్పందించని పీపీ/ఏపీపీలపై చర్యలు తీసుకోవాలి.
*   రిమాండ్‌ పొడిగింపు పిటిషన్లను ప్రత్యేక కోర్టులు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి. తరచూ వాయిదాలు వేస్తుండటంతో నిందితులు 200పైగా రోజులు జైళ్లలో మగ్గుతున్నారు.
*   విశాఖలోని ప్రత్యేక కోర్టులో బెయిలు కోసం వేసిన పిటిషన్లకు 10 నుంచి 15 రోజులకు నంబరు ఇస్తున్నట్లు హైకోర్టు దృష్టిలో ఉంది. 2021 సెప్టెంబరు నుంచి నవంబరు 1 మధ్య.. బెయిలు పిటిషన్లు ఎప్పుడు దాఖలయ్యాయి, వాటికి నంబరు ఎప్పుడు కేటాయించారు. విచారణకు ఎప్పడొచ్చాయి. న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఎప్పుడు జారీచేసిందనే వివరాలతో విశాఖలోని ఎన్‌డీపీఎస్‌ కేసుల విచారణ ప్రత్యేక జడ్జి.. హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి’ అని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని