ముగుస్తున్న 700 మైనింగ్‌ లీజుల గడువు

రాష్ట్రంలో వివిధ ఖనిజాలకు చెందిన దాదాపు 700 లీజుల గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. వీటిని పునరుద్ధరించాలని పదేపదే విజ్ఞప్తులు చేయడంతో.. అమాత్యులు, అధికారులు సానుకూలంగా స్పందించి కూడా ఏడెనిమిది నెలలవుతోంది.

Updated : 29 Mar 2023 05:43 IST

పునరుద్ధరణపై ఇప్పటివరకు ఆదేశాలివ్వని సర్కారు
ఆందోళనలో లీజుదారులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఖనిజాలకు చెందిన దాదాపు 700 లీజుల గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. వీటిని పునరుద్ధరించాలని పదేపదే విజ్ఞప్తులు చేయడంతో.. అమాత్యులు, అధికారులు సానుకూలంగా స్పందించి కూడా ఏడెనిమిది నెలలవుతోంది. అయినా ఇప్పటికీ దీనిపై ఉత్తర్వులు వెలువడకపోవడంతో లీజుదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఈ-వేలం ద్వారా కొత్త లీజులు కేటాయించే విధానం తీసుకొచ్చారు. పాత లీజు గడువు ముగిస్తే, వాటిలో ఈ నెల 31 వరకు మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని, తర్వాత వాటికీ ఈ-వేలం నిర్వహిస్తామని ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం లీజుల గడువు ముగియగానే, వాటిని పునరుద్ధరించేవారు. రాష్ట్రప్రభుత్వ కొత్త విధానంతో పునరుద్ధరణకు వీలులేకుండా పోయింది.

సానుకూలంగా స్పందించినా..

లీజు పొందినప్పటి నుంచి వాటికి అనుమతులు తెచ్చుకొని, మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చామని, ఇప్పుడు పునరుద్ధరించకపోతే అన్నివిధాలా నష్టపోతామని లీజుదారుల సంఘాలు తెలిపాయి. దీంతో కొత్త పాలసీపై పునఃసమీక్షించేందుకు గనులశాఖ అధికారులు, లీజుదారుల సంఘాల ప్రతినిధులతో కమిటీలు వేశారు. అవి కూడా లీజుల పునరుద్ధరణే సరైనదని సూచించాయి. దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కొన్ని నెలల క్రితం గనులశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నెలాఖరుతో గడువు ముగిసే 700 లీజుల్లో.. అత్యధికంగా రోడ్‌ మెటల్‌వి ఉండగా, ఆ తర్వాత గ్రానైట్‌ లీజులున్నాయి.

ప్రీమియం బాదుడుతో పునరుద్ధరిస్తారా?

కొత్త లీజుల ఈ-వేలం సమయంలో ఆయా ఖనిజాలకు వేర్వేరు రిజర్వ్‌ ధరలను నిర్ణయించారు. ఇప్పుడు దాదాపు అంతే మొత్తాలను ప్రీమియం నగదుగా తీసుకొని, గడువు ముగిసే లీజులను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.

* గ్రానైట్‌ లీజులకు వార్షిక డెడ్‌రెంట్‌ హెక్టారుకు రూ.1.30 లక్షలు. ఇందులో బ్లాక్‌గెలాక్సీ రకానికి 8 రెట్లు పెంచి హెక్టారుకు రూ.10.40 లక్షలు రిజర్వ్‌ ధరగా చేశారు. కలర్‌, శ్రీకాకుళం బ్లూ, మూన్‌వైట్‌, రివర్‌వైట్‌ విశాఖపట్నం, బ్లాక్‌ పెరల్‌, సిల్వర్‌ వేవ్స్‌ రకాలకు 7 రెట్లు, చిత్తూరు, మదనపల్లి తదితర రకాలకు 5 రెట్లు పెంచి రిజర్వ్‌ ధరగా నిర్ణయించారు.

* మార్బుల్‌, లైమ్‌స్టోన్‌, బిల్డింగ్‌ స్టోన్‌, రోడ్‌ మెటల్‌ తదితరాలకు వార్షిక డెడ్‌రెంట్‌ హెక్టారుకు రూ.65 వేలు ఉండగా, దానికి అయిదు రెట్లతో రూ.3.25 లక్షలు రిజర్వ్‌ ధర చేశారు.

* కాల్సైట్‌, క్లే, డోలమైట్‌ తదితరాలకు వార్షిక డెడ్‌రెంట్‌ హెక్టారుకు రూ.20 వేలు ఉండగా, దానికి 8 రెట్లు పెంచి రూ.1.60 లక్షలు రిజర్వ్‌ ధరగా పేర్కొన్నారు.

* గ్రావెల్‌, మొరం, మట్టి లీజులకు వార్షిక డెడ్‌రెంట్‌ రూ.52 వేలు ఉండగా, దానికి 5 రెట్లు.. రూ.2.60 లక్షలు రిజర్వ్‌ ధర చేశారు.

* ఇపుడు ఈ రిజర్వ్‌ ధరలనే ప్రీమియంగా చెల్లిస్తే, లీజులు పునరుద్ధరించేలా నిబంధనల్లో సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏయే ఖనిజ లీజులకు ఎంత ప్రీమియం మొత్తం ఉండాలనేది పేర్కొంటూ ప్రభుత్వానికి ఇప్పటికే గనులశాఖ దస్త్రాన్ని పంపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మైనింగ్‌ పాలసీలో సవరణ చేస్తూ ఉత్తర్వులిస్తే, లీజుల పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని