APSRTC: ఏపీలో ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం

విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా విమాన సర్వీసులు లేకపోతే.. మధ్యలో వేరొక చోట విమానం మారి ఎలా ప్రయాణిస్తారో అలాంటి ఏర్పాట్లను ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు.

Updated : 05 May 2023 07:10 IST

ఆర్టీసీలో కొత్తగా మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్‌ విధానం

ఈనాడు-అమరావతి: విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా విమాన సర్వీసులు లేకపోతే.. మధ్యలో వేరొక చోట విమానం మారి ఎలా ప్రయాణిస్తారో అలాంటి ఏర్పాట్లను ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు. ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో వేరొక నగరం, పట్టణంలో బస్సు మారి వెళ్లేందుకు ఒకే టికెట్‌ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్‌’ పేరిట దీనిని రూపొందించారు. ఉదాహరణకు శ్రీకాకుళానికి చెందిన ఓ ప్రయాణికుడు అనంతపురం వెళ్లేందుకు నేరుగా బస్సు ఉండదు. కొత్త విధానంలో శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి, విజయవాడ నుంచి అనంతపురానికి వేరొక సర్వీసులో వెళ్లేందుకు ఒకే టికెట్‌లో రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్‌ చేసుకున్నాసరే కేవలం ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్‌ ఛార్జి తీసుకోనున్నారు. ప్రయాణికుడు తొలుత ఒక బస్సులో వెళ్లి ఓ పట్టణం/నగరంలోని వేరొక బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల గడువునిచ్చారు. ఆ సమయాల్లో ఉన్న సర్వీసులను ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలిసారి అమలుచేయనున్నారు. యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారాగానీ, ఆర్టీసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారాగాని ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు వీలుంది. దేశంలోని ప్రభుత్వరంగ ఆర్టీసీల్లో మన రాష్ట్రంలోనే ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానం ప్రారంభిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని