YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ

పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మరోమారు గిరిజనుల నుంచి నిరసన ఎదురైంది.

Updated : 28 May 2023 07:42 IST

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మరోమారు గిరిజనుల నుంచి నిరసన ఎదురైంది. గతంలో శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని హీరాపురం, చందనగిరి గ్రామాల వద్ద గిరిజన యువకులు నిరసన తెలియజేయగా, శనివారం అదే మండలంలోని జోడూరు పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమె పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా జెన్నిబంద గ్రామం వద్ద గిరిజన యువకులు ఆమెను అడ్డుకొని గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వారితో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినా వినకుండా ‘మీకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించామని, బోయ, వాల్మీకిలైన అగ్ర కులాలను ఎస్టీల్లో చేర్పించి తమకు తీవ్ర అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు సంబంధించిన ఐటీడీఏ, ట్రైకార్‌ నిధులు ఏమయ్యాయని.. గ్రామానికి కనీసం రహదారి, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న డిల్లీరావు అనే గిరిజన యువకుడి సెల్‌ఫోన్‌ను ఎమ్మెల్యే వ్యక్తిగత రక్షకుడు(సెక్యూరిటీ) తీసుకొని అందులోని వీడియోలను, చిత్రాలను తొలగించారు. దీంతో ఒక్కసారిగా యువకులు ఆగ్రహించారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపకపోతే రానున్న ఎన్నికల్లో మీకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అచ్చనాపురంలో సైతం రహదారికి అడ్డంగా కట్టెలు వేసి గో బ్యాక్‌ ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు. వైకాపా నాయకులు, పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తమకు ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని.. ఒట్టి మాటలెందుకంటూ స్థానికులు ఆగ్రహించారు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి అచ్చనాపురం గ్రామాన్ని సందర్శించకుండా వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని