వీళ్లా కొత్త ఎస్పీలు?

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా అధికార వైకాపాపై పదే పదే స్వామిభక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎక్కడా మొహమాటపడటం లేదు.

Updated : 05 Apr 2024 07:02 IST

సగానికి పైగా వైకాపా విధేయులే!
అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచేసిన చరిత్ర వారిది
అలాంటి వారిని ఏరికోరి ప్రతిపాదించిన సీఎస్‌ జవహర్‌రెడ్డి
వైకాపాకు స్వామిభక్తి ప్రదర్శించడంలో ఏ మాత్రం తగ్గని వైనం
ఈనాడు - అమరావతి

న్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా అధికార వైకాపాపై పదే పదే స్వామిభక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎక్కడా మొహమాటపడటం లేదు. ఎన్నికల సమయంలోనైనా ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమోననుకుంటే... ‘లేదు లేదు.. నన్ను సందేహించాల్సిందే’ అని ప్రతి సందర్భంలోనూ చాటిచెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించే క్రమంలోనూ సీఎస్‌ తన ఏకపక్ష ధోరణిని, ఎన్నికల్లో వైకాపాకు ఎలాగైనా మేలు చేయాలన్న తపనను బయటపెట్టారు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్‌ హఫీజ్‌, ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ అత్యంత వివాదాస్పదులు. గత అయిదేళ్లలో వైకాపా ప్రయోజనాల కోసమే పనిచేశారు. అలాంటి అధికారుల్ని ఏరికోరి సీఎస్‌ ప్రతిపాదించారు. అలాంటప్పుడు ఇదివరకున్న అధికారుల్ని బదిలీ చేసి ప్రయోజనమేంటి? వైకాపా నాయకులు చెప్పిందే చట్టం.. చేసిందే శాసనం అన్నట్టుగా పనిచేసిన కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఈసీ ఇప్పటికే వేటు వేసినా... తనపై కూడా కత్తి వేలాడుతున్నా జవహర్‌రెడ్డి ఇంకా స్వామిభక్తి వీడలేదనడానికి తాజాగా ఎస్పీల నియామకమే నిదర్శనం. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలన్న ఉద్దేశంతో ఈసీ వేటు వేసిన అధికారుల స్థానంలో మళ్లీ అధికార పార్టీతో అంటకాగే అధికారుల్నే నియమించేలా సీఎస్‌ చక్రం తిప్పుతున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అధికారుల్ని బదిలీ చేసేది ఎన్నికల సంఘమే అయినా.. బదిలీ అయినవారి స్థానంలో నియమించేందుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు పంపించాల్సింది ప్రధాన కార్యదర్శే. అక్కడే జవహర్‌రెడ్డి తన చాతుర్యాన్ని, అధికారపార్టీపై అంతులేని విధేయతను ప్రదర్శిస్తున్నారు. ఈసీ కళ్లకే గంతలు కడుతున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాసేవారి పేర్లను ఈ ప్యానల్‌లో ప్రతిపాదించడం కుట్రేనని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే ముందు సీఎస్‌ను బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఎస్పీలుగా వాళ్లు అనర్హులు!

అధికార వైకాపాకు బంటుల్లా మారి ఏకపక్షంగా పనిచేసినందుకుగాను తాజాగా బదిలీ వేటుకు గురైన ఎస్పీల స్థానాల్లో.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా నియమించిన ఐపీఎస్‌ అధికారుల్లో కొంతమంది ఆ తాను ముక్కలే ఉన్నారు. గత అయిదేళ్లుగా అధికార పార్టీతో అంటకాగుతూ, అరాచకాలకు కొమ్ముకాశారన్న ఫిర్యాదులు వీళ్లపై ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం అన్నట్లుగా పనిచేసి, వారి సేవలో తరించారన్న విమర్శలున్నాయి. 

దాడులకు తెగబడ్డ వాళ్లను వదిలేశారు..

నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్‌ హఫీజ్‌... 2021 జూన్‌ నుంచి మొన్న జనవరి వరకూ గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. అక్కడున్నంత కాలం పూర్తిగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారు. ఆ పార్టీ నాయకులు చెప్పినట్లే నడుచుకున్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా గూండాలు ఇనుపరాడ్లు, కర్రలు, కత్తులు, రాళ్లతో దాడికి తెగబడి విధ్వంసం సృష్టిస్తే.. ఒక్కరంటే ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. దాడి దృశ్యాల్లో నిందితులందరి ముఖాలు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నా వారి జోలికి వెళ్లలేదు. తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టేసి మమ అనిపించేశారు. కొద్దిమందికి 41ఏ నోటీసులిచ్చి సరిపెట్టేశారు. దాడికి కుట్ర చేసిన వారిని నిందితులుగానే చేర్చలేదు. తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపైకి అప్పటి వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌ వందల మందితో దండయాత్రగా వెళ్లి దాడి చేస్తే నిందితుల్ని అరెస్టు చేయలేదు. తిరిగి ప్రతిపక్ష నేతలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు. దళితుడైన బియ్యం వ్యాపారి హత్య కేసులో నిందితులైన వైకాపా నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కళ్ల ముందే తిరుగుతున్నా వాళ్లనూ అరెస్టు చేయలేదు. అమరావతి ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించినవారిని పోలీసులు నియంత్రించలేదు. దాడికి పాల్పడ్డవారిని ఎవర్నీ అరెస్టు చేయలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై అల్లరిమూకలు రాయి విసిరితే రాత్రికి రాత్రి స్పందించేసి 30 మందిని అరెస్టు చేశారు. ఘటనతో సంబంధం లేని వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్నా కేసు అయినప్పటికీ అరెస్టు చేసి కోర్టు ముందుంచారు. ఇలాంటి అధికారిని నెల్లూరు లాంటి కీలకమైన జిల్లాలో ఎస్పీగా నియమించటమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వైకాపాకు అనుకూలంగా పనిచేశారనే ముద్ర

అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్‌ బర్దర్‌కూ వైకాపా అనుకూలంగా పనిచేస్తారన్న ముద్ర ఉంది. 2020 నుంచి 2022 ఏప్రిల్‌ వరకూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి మొన్న జనవరి నెల వరకూ సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా పనిచేశారు. ఎక్కడైనా వైకాపా నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేశారు. అలాంటి అధికారిని  ఎన్నికల వేళ  అనంతపురం ఎస్పీగా నియమించటం వివాదాస్పదమవుతోంది.


పవన్‌ కల్యాణ్‌పైనే జులుం

ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్‌ సుమిత్‌ సునీల్‌.. విశాఖపట్నం కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం డీసీపీగా పనిచేశారు. వైకాపా నాయకులు చెప్పారని అడ్డగోలుగా వ్యవహరించారు. 2022 అక్టోబరులో విశాఖలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ జులుం ప్రదర్శించారు. పవన్‌ తన వాహనంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఆ కారుపైకి సునీల్‌ ఎక్కారు. జనాలకు కనబడొద్దని, కారులోనే కూర్చోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ చేతులు పట్టుకుని అణిచేశారు. ‘ఒక ఐపీఎస్‌ అధికారై ఉండి ఇలా ప్రవర్తిస్తారా? గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నన్ను రెచ్చగొట్టేందుకే ఇలా చేశారు’ అంటూ అప్పట్లో జనసేనాని వ్యాఖ్యానించారు. ఆయన్ను విశాఖపట్నంలో పర్యటించకుండా నోవోటెల్‌ హోటల్‌కే పరిమితమయ్యేలా చేశారు. అధికార పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపే క్రమంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజా వాహన శ్రేణిపై చెప్పులు విసిరితే ప్రతిపక్ష పార్టీ కార్య్యకర్తలపై హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు. ఘటనాస్థలంలో లేని వారినీ కేసుల్లో ఇరికించారు. అర్ధరాత్రి ఇంటింటికీ వెళ్లి వెంటాడి వేటాడి మరీ వందమందికి పైగా జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేశారు. అలాంటి అధికారిని ప్రకాశం ఎస్పీగా నియమించారు.


ప్యానల్‌లోనూ... వైకాపా అనుకూల అధికారులకే చోటు

  • వైకాపాకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలతో బదిలీ వేటుకు గురైన వారి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ముగ్గురేసి చొప్పున ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ఎన్నికల సంఘానికి ప్యానల్‌ వెళ్లింది. అందులో ప్రతిపాదించిన పేర్లలోనూ వైకాపా అనుకూల అధికారులకే చోటు కల్పించారు.
  • అనంతపురం జిల్లా ఎస్పీ పోస్టు కోసం.. ఆర్‌.గంగాధర్‌రావు పేరును ప్యానల్‌లో ప్రతిపాదించారు. ఆయన గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అంగళ్లులో పర్యటించిన సందర్భంలో వైకాపా నాయకులు ఆయనపై దాడులు చేసి, రాళ్లు విసిరితే వాళ్లను వదిలేసి.. బాధితుడైన చంద్రబాబుపైనే ఏకంగా హత్యయత్నం కేసు పెట్టడంలో గంగాధర్‌రావు పాత్ర కీలకం. వైకాపాకు అనుకూలంగా ఉంటారనే ముద్ర ఉన్న టి.పనసారెడ్డిని కూడా ఈ జిల్లా ఎస్పీ పోస్టు కోసం ప్రతిపాదించారు.
  • చిత్తూరు జిల్లా ఎస్పీ పోస్టు కోసం రాజమహేంద్రవరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆర్‌వీఈవో కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డి పేరు ప్రతిపాదించారు. ఆయనకూ వైకాపా అనుకూలమనే ముద్ర ఉంది.
  • నెల్లూరులో వైకాపాకు ఏకపక్షంగా పని చేసే వ్యక్తిని ఎస్పీగా నియమించడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ కోసం పంపిన ప్యానల్‌లో ఆరిఫ్‌ హఫీజ్‌తోపాటు కన్ఫర్డ్‌ ఐపీఎస్‌లుగా కొన్నాళ్ల కిందటే పదోన్నతులు పొందిన వి.రత్న, ఏబీటీఎస్‌ ఉదయరాణి పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరికీ గతంలో ఎస్పీగా పని చేసిన అనుభవం లేదు. ఆరిఫ్‌ హఫీజ్‌ ఎంపికకు వీలుగా వీళ్లిద్దరు పేర్లూ ప్రతిపాదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
గుంటూరు రేంజి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
5 జిల్లాలకు నూతన ఎస్పీలు
వేటుకు గురైన వారి స్థానంలో నియామకం

ధికార వైకాపాతో అంటకాగుతూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై బదిలీ వేటుకు గురైన కలెక్టర్లు, ఎస్పీలు, గుంటూరు రేంజి ఐజీ స్థానంలో ఎన్నికల సంఘం వేరే అధికారులను నియమించింది. గురువారం రాత్రి 8 గంటల్లోగా వీరు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖ రాసింది. తాజాగా ఎన్నికల సంఘం నియమించిన అధికారుల వివరాలివీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని