చంద్రబాబు, లోకేశ్‌లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్‌గ్రిడ్‌, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఇతర నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సిట్‌ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2)...

Updated : 09 Apr 2024 12:00 IST

ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసిన సిట్‌ సిబ్బంది
ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు
జిరాక్స్‌ మిషన్‌ వేడెక్కటం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట!
ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదట!
అందుకే కాల్చేశారట
సిట్‌ అధిపతి రఘురామ్‌రెడ్డి సమాధానం
ఈనాడు - అమరావతి

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్‌గ్రిడ్‌, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఇతర నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సిట్‌ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2)... సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా కేసులకు సంబంధించిన పలు పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్‌ కార్యాలయం ఉన్న ‘‘సంవృద్ధి నెక్సా’’ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ పత్రాలను తగలబెట్టేశారు. మరో 34 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులకు సంబంధించిన ముఖ్య పత్రాలను తగలబెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగుకు సంబంధించిన ఆధారాలను, హార్డ్‌డిస్క్‌లను అక్కడి పోలీసు అధికారులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన  వెంటనే ధ్వంసం చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలు, వాంగ్మూలాలు వంటి వాటిని ధ్వంసం చేశారా అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.

చంద్రబాబు దస్త్రాలివి.. కాల్చేసి వీడియోలు పంపాలని పెద్దసారు చెప్పారు

సిట్‌ అధిపతి, ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి వద్ద పనిచేసే సిబ్బంది ఓ సంచీ నిండా పత్రాలు తీసుకొచ్చి అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఓ మూలన కుప్పగా పోశారు. ఆ తర్వాత దానికి నిప్పు అంటించారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు వివరాలు, ఈ కేసులో హెరిటేజ్‌ సంస్థ... సిట్‌ అదనపు ఎస్పీకి రాసిన సమాధానాల ప్రతులు, హెరిటేజ్‌ లోగోతో ఉన్న ఇతర పత్రాలు సహా, మరికొన్ని దస్త్రాలనూ కాల్చేశారు. ఈ మొత్తం దృశ్యాలను సిట్‌ సిబ్బందే చిత్రీకరించారు. పత్రాలు తగలబెడుతుండటాన్ని గమనించిన స్థానికులు కొందరు.. అవి ఏం పత్రాలు? ఎందుకు కాలుస్తున్నారు అని ప్రశ్నించగా ‘ఇవి చంద్రబాబుకు సంబంధించిన దస్త్రాలు’ అంటూ ఆ సిబ్బంది సమాధానమిచ్చారు. పత్రాలను కాల్చేసి ఆ వీడియోలు పంపించాలని తమ పెద్దసారు చెప్పారని.. అందుకే వీడియోలు తీస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు కొందరు వారి సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా.. వాటిని తీయవద్దంటూ సిట్‌ సిబ్బంది బెదిరించారు. సెల్‌ఫోన్ల నుంచి ఆ దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి చేశారు. పత్రాల దహనం అంశం మీడియాలో ప్రసారం కావడంతో అక్కడ కాల్చిన కాగితాల ఆనవాళ్లు కనబడకుండా చేసేందుకు ప్రయత్నించారు. కేవలం ఏవో వ్యర్థాలు కాల్చినట్లుగా బూడిద కుప్ప మాత్రం అక్కడ ఉంది. దగ్గరకు వెళ్లి చూస్తే కాల్చిన పత్రాల ముక్కలు కనిపించాయి. వాటిల్లో లింగమనేని రమేశ్‌ పేరు, ఇతర అంశాలు ఉన్నాయి.

పత్రాలు కాల్చేయడం వెనుక అసలు గుట్టేమిటి?

గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్‌ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సిట్‌ ఏర్పాటు చేసింది. వైకాపాకు కొమ్ముకాసే అధికారిగా విమర్శలున్న ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డిని దీనికి అధిపతిగా నియమించింది. ఆ తర్వాత దీన్ని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2గా మార్చింది. సిట్‌ ఏర్పాటైనప్పటి నుంచి తెదేపా ముఖ్య నాయకులే లక్ష్యంగా ఇది పనిచేసింది. నిరాధార, నిర్హేతుకమైన అంశాలతో తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు నారా లోకేశ్‌, నారాయణలపై సిట్‌లో కేసులు నమోదు చేశారన్న ఫిర్యాదులున్నాయి. సిట్‌ అధికారులు నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబీకుల్ని నిందితులుగా చేర్చారు. గతేడాది అక్టోబరు 10, 11 తేదీల్లో నారా లోకేశ్‌ను, ఆ తర్వాత తెదేపా నాయకుడు కిలారు రాజేశ్‌ను ఈ సిట్‌ కార్యాలయానికే పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. అప్పట్లో లోకేశ్‌ విచారణ సందర్భంగా.. హెరిటేజ్‌కు సంబంధించిన అంశాలపైనే ఆయన్ను ఎక్కువగా ప్రశ్నించారు.

నారా భువనేశ్వరికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌ పత్రాలను... లోకేశ్‌ ముందు పెట్టి వాటిపైనా ప్రశ్నించారు. ‘ఈ పత్రాలు మీకు ఎలా వచ్చాయి’ అంటూ దర్యాప్తు అధికారిని తాను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేక దాటవేశారని అప్పట్లో లోకేశ్‌ మీడియాకు వెల్లడించారు. ‘ఈ వ్యవహారాన్ని నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నా. మా అమ్మ ఐటీ రిటర్న్స్‌ అధికారికంగా తీసుకున్నారా? అనధికారికంగా తెచ్చారా? సీఐడీ వారికి ఎలా వచ్చాయనేది తేలుస్తాం’ అంటూ అప్పట్లో లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ సిబ్బంది... ఇన్నర్‌రింగ్‌ రోడ్డు సహా, ఇతర కేసులకు సంబంధించిన పత్రాలను సోమవారం కాల్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పత్రాలను ఎందుకు కాల్చాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న మర్మమేమిటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు వీలుగా ఏవైనా పత్రాలు సృష్టించారా? చట్టవిరుద్ధంగా ఏవైనా పత్రాలు సమకూర్చుకున్నారా? వాటినే కాల్చేశారా అనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

జిరాక్స్‌ మిషన్‌ వేడెక్కి కాగితాలు ఇరుక్కుపోయాయి..: సిట్‌ అధిపతి రఘురామ్‌రెడ్డి

సిట్‌ కేసులకు సంబంధించిన పత్రాల దహనం ఘటనపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా... వాటన్నింటినీ నివృత్తి చేసేలా పూర్తి స్పష్టతతో సమాధానమివ్వాల్సిన సిట్‌ అధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి. ‘సిట్‌ నమోదు చేసిన కేసులకు సంబంధించి కొన్ని లక్షల పేజీలను జిరాక్సులు తీయిస్తున్నాం. దీంతో జిరాక్స్‌ యంత్రాలు వేడెక్కిపోయాయి. కాగితాలు ఆ యంత్రాల్లో ఇరుక్కుపోయాయి. జిరాక్స్‌ మిషన్‌లో ఇంకు స్థాయి తగ్గటం వల్ల ప్రింట్లు మసకగా వచ్చాయి. అందుకే అలాంటి పేపర్లన్నింటినీ బయటకు తీసి వాటిని కాల్చేశాం. వాటి స్థానంలో కొత్తగా ప్రింట్లు తీసుకున్నాం’ అని రఘురామిరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాల్చేసిన కాగితాలు చూస్తే వాటిపై ప్రింటు స్పష్టంగా కనిపిస్తోంది. కాలిన దస్త్రాల మధ్య ఉన్న కాగితాలపై కూడా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిరాక్స్‌ మిషన్‌లో ఇరుక్కుపోయిన కాగితాలను బయటకు తీస్తే అవి కొంత చిరిగి ఉంటాయి. కానీ కాల్చిన కాగితాలు చిరిగినట్లుగా లేవు. పైగా వాటన్నింటినీ బండిల్స్‌ కట్టి మరీ కాల్చడం కోసం తీసుకొచ్చారు. రఘురామ్‌రెడ్డి చెబుతున్న దానికి, వాస్తవంగా జరిగిన దానికీ ఏ మాత్రమూ పొంతనలేదు. తెదేపా నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలు మాత్రమే జిరాక్స్‌ మిషన్‌లో ఇరుక్కుపోయాయా? ఆ ప్రింట్లు మాత్రమే సరిగ్గా రాలేదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండు చేస్తున్నాయి.

దర్యాప్తు బృందాన్ని బెదిరించేందుకే: కొల్లి రఘురామ్‌రెడ్డి

‘అయిదు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశాం. అంతకంటే ముందే ఆయా కేసుల డైరీలు, ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి సమర్పించాం. అభియోగపత్రాలతో పాటు సమర్పించిన ఆధారాలన్నీ నిందితులకు కోర్టు ద్వారా అందించాల్సి ఉంటుంది. ఒక్కో అభియోగపత్రంతో పాటు 8 -10 వేల పత్రాలున్నాయి. ఒక్కో కేసులో 12 నుంచి 40 మంది వరకూ నిందితులున్నారు. వాళ్లందరికీ ఈ పత్రాలు ఇవ్వటం కోసం లక్షల పేజీలు జిరాక్స్‌లు తీయిస్తున్నాం. దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను, దర్యాప్తు అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పలు మీడియా సంస్థలు బాధ్యతారహితంగా కథనాలు ప్రసారం చేశాయి. అలాంటి అనైతిక చర్యలకు మీడియా దూరంగా ఉండాలి. నేరాన్ని రుజువు చేసేందుకు తగిన సహేతుక ఆధారాల్ని కోర్టు ముందు పెట్టాం.

కొంతమంది వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆధారాలను సృష్టించారని, హెరిటేజ్‌ సంస్థకు, వ్యక్తులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లకు సంబంధించిన పత్రాలను చట్టవిరుద్ధంగా పొందారని అందుకే వాటిని ధ్వంసం చేశారని తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఇది దర్యాప్తు బృందాన్ని బెదిరించడమే. ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారమే నిందితుడు, ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను అధికారికంగా తీసుకున్నాం. ఇతర ఆధారాల్లాగానే ఈ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను చట్టబద్ధంగానే పొందాం. కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఈ రిటర్న్స్‌ కూడా ఒక భాగం. ఈ ఐటీ రిటర్న్స్‌ ఆధారంగానే నిందితుడ్ని ప్రశ్నించాం. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన పత్రాలన్నీ ఆ కంపెనీ ప్రతినిధుల ద్వారా అధికారికంగానే పొందాం’ అని కొల్లి రఘురామ్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని