Srisailam:శ్రీశైలం ప్లంజ్‌ పూల్‌ పనులకు ఉత్త చేయేనా?

శ్రీశైలం డ్యాం భద్రత పనులను కేంద్ర జలశక్తిశాఖ చేపట్టిన డ్రిప్‌-2 విభాగంలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. డ్యాం భద్రత కోసం ప్రతిపాదిస్తున్న రూ.700 కోట్ల ప్లంజ్‌ పూల్‌ పనులను డ్రిప్‌ పథకంలో చేర్చడంపై ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం భద్రత కమిటీ నిరాసక్తత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated : 08 Jan 2022 13:00 IST

కాంక్రీటుతో పూడ్చినా ప్రయోజనం ఉండదు

డ్యాం భద్రతా కమిటీ ఛైర్మన్‌ వ్యాఖ్య
ఆ పనులు డ్రిప్‌-2 పథకంలో చేర్చడం అనుమానమే

ఈనాడు, అమరావతి: శ్రీశైలం డ్యాం భద్రత పనులను కేంద్ర జలశక్తిశాఖ చేపట్టిన డ్రిప్‌-2 విభాగంలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. డ్యాం భద్రత కోసం ప్రతిపాదిస్తున్న రూ.700 కోట్ల ప్లంజ్‌ పూల్‌ పనులను డ్రిప్‌ పథకంలో చేర్చడంపై ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం భద్రత కమిటీ నిరాసక్తత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలోని వివిధ ఆనకట్టల భద్రత నిమిత్తం కేంద్ర జలశక్తిశాఖ ప్రపంచ బ్యాంకు నిధులతో డ్రిప్‌ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో కేంద్ర, రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఏపీ నుంచి 31 ప్రాజెక్టులను పరిశీలించినా అవి పథకం మార్గదర]్శకాల ప్రకారం లేకపోవడంతో డ్రిప్‌ నిధులు తెచ్చుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి సంబంధించిన కొన్ని పనులను ప్రతిపాదించారు.

వరదలతో పెద్ద గొయ్యి
2009 వరదల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు డ్యాం డిజైన్‌ను మించి ప్రవాహాలు వచ్చాయి. ఆ స్థాయి ప్రవాహాన్ని తట్టుకునేలా పనులు చేపట్టాలి. ఇప్పటికే శ్రీశైలం స్పిల్‌వే దిగువన ప్లంజ్‌ పూల్‌లా పెద్ద గొయ్యి ఏర్పడింది. అది స్పిల్‌వే వరకు విస్తరిస్తోంది. డ్యాం భద్రతా కమిటీ 2017, 2020ల్లో రెండుసార్లు శ్రీశైలం భద్రతపై సమీక్షించి, అనేక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం డ్రిప్‌-2 పథకంలో.. రూ.700 కోట్లతో శ్రీశైలం ప్లంజ్‌ పూల్‌ను కాంక్రీటుతో పూడ్చటం, మరో రూ.90 కోట్లతో పలు చిన్న చిన్న పనులు ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో ఏర్పడ్డ డ్యాం భద్రతా కమిటీ ఈ ప్రాజెక్టులను పరిశీలించి డ్రిప్‌ కింద ఈ పనులు చేపట్టవచ్చని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా డ్యాం భద్రతా కమిటీ శ్రీశైలం డ్యామ్‌ను ఈ నెల మొదటి వారంలో సందర్శించి, అక్కడే సమావేశమైంది.

గండిపడ్డట్లేనా..!
ప్లంజ్‌ పూల్‌ ఏర్పడటం అత్యంత సహజమని డ్యాం భద్రతా కమిటీ ఛైర్మన్‌ పాండ్యా ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. 2005లో అక్కడ కాంక్రీటుతో పనులు చేస్తే కనీసం ఆనవాళ్లు కూడా లేవని, ప్లంజ్‌ పూల్‌ను కాంక్రీటుతో నింపితే ఉపయోగమేమీ ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో డ్రిప్‌లో ఈ పనులకు నిధులు వచ్చే అవకాశాలు లేనట్లేనని సమాచారం. రూ.90 కోట్ల విలువైన చిన్నచిన్న పనులకే డ్రిప్‌లో అవకాశం దక్కొచ్చని తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు శాశ్వత రక్షణ పనులపైనా సమావేశంలో కొంత చర్చ జరిగిందని తెలిసింది. ప్రాజెక్టు వద్ద ఉన్న రాతిపొరల్లో సున్నపురాయి ఉంటుంది. నీటి ప్రవాహానికి అది కరిగిపోతూ రాయి స్థిరత్వం కొంత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో ఫైమెట్‌ ఎలిమెంట్‌ మేథమేటికల్‌ ఎనాలసిస్‌ చేయించాలని ఈ కమిటీ సూచించింది. చెన్నై ఐఐటీ నిపుణులతో గతంలో ఇలాంటి విశ్లేషణ చేయించామని, ఆ నివేదిక ప్రతిని తెప్పిస్తామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి సంబంధించి ప్రతిపాదించిన రూ.60 కోట్ల పనులకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని