Cryptocurrency: వజీరిక్స్‌ రూ.40 కోట్ల పన్ను ఎగవేత.. మరిన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కొనసాగుతున్న సోదాలు!

దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) సర్వీస్‌ ప్రొవైడర్ల కార్యాలయాల్లో ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ)’ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు....

Published : 01 Jan 2022 17:41 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) సర్వీస్‌ ప్రొవైడర్ల కార్యాలయాల్లో ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ)’ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో పన్ను ఎగవేసినట్లు(GST evasion) సమాచారం ఉన్న నేపథ్యంలో తనిఖీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఏజెన్సీ వజీరిక్స్‌(WazirX)పై శుక్రవారం జీఎస్టీ ముంబయి ఈస్ట్‌ కమిషనరేట్‌ అధికారులు సోదాలు జరిపారు. దాదాపు రూ.40.5 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేత, వడ్డీ, అపరాధ రుసుముతో కలిపి రూ.49.20 కోట్లు వసూలు చేశారు. ఈ ఎక్స్ఛేంజీని నిర్వహిస్తున్న జన్మాయ్‌ ల్యాబ్స్‌, బైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ లిమిటెడ్‌ వ్యాపార కార్యకలాపాల్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ అవకతవకలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు.

వజీరిక్స్‌ ఎక్స్ఛేంజీ ద్వారా రూపాయి లేదా డబ్ల్యూఆర్‌ఎక్స్‌(WRX) అనే క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రేడర్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు. డబ్ల్యూఆర్‌ఎక్స్‌ను వజీరిక్స్‌ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్ఛేంజీ వారు ఇటు విక్రయదారుడితో పాటు కొనుగోలు చేస్తున్న వారి దగ్గరి నుంచి కూడా కమీషన్‌ వసూలు చేస్తున్నారు. కానీ, ఇరు వర్గాలకూ కమీషన్‌ రేటు మాత్రం భిన్నంగా నిర్ణయించారు. రూపాయల్లో చేసే లావాదేవీలపై 0.2 శాతం.. డబ్ల్యూఆర్‌ఎక్స్‌పై చేసే ట్రాన్సాక్షన్స్‌పై 0.1 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు.

అయితే ఎక్స్ఛేంజీ నిర్వాహకులు కేవలం రూపాయల్లో చేసే లావాదేవీలపై వసూలు చేస్తున్న కమీషన్‌పై మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌ పరిధిలోకి వస్తాయి. దీంతో డబ్ల్యూఆర్‌ఎక్స్‌ లావాదేవీలపై వసూలు చేసిన కమీషన్‌పై చెల్లించాల్సిన జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. మొత్తం వడ్డీ, అపరాధ రుసుముతో కలిపి రూ.49.20 కోట్లు వసూలు చేశారు.

ఇలా ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌(NFT) సహా ఇతరత్రా రంగాల్లో పన్ను ఎగవేతకు అవకాశం ఉన్న అన్ని రంగాల కార్యాలయాలపై  సోదాలు కొనసాగుతున్నాయని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరోవైపు శుక్రవారం విదేశీ కంపెనీల నియంత్రణలో ఉన్న కొన్ని మొబైల్‌ తయారీ సంస్థల్లో నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో రూ.6,500 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని