Auto Industry: ఆటోకు ఆసరాగా రూ.25,000 కోట్ల ప్రోత్సాహకాలు?

వివిధ సమస్యలతో సతమతమవుతున్న వాహన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు భారీ ప్రోత్సాహకాల్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది....

Published : 08 Sep 2021 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ సమస్యలతో సతమతమవుతున్న వాహన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు భారీ ప్రోత్సాహకాల్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రోత్సాహకాలను ఆ రంగానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

వాహన తయారీ, అనుబంధ కంపెనీలకు దాదాపు రూ.25,000 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. తొలుత పెట్రోల్‌, డీజిల్‌ వాహన తయారీ సంస్థలకు మాత్రమే రాయితీలు అందించాలనుకున్న సర్కార్‌ ఇటీవల మనసు మార్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విద్యుత్తు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలకు గిరాకీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకాలు కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహనాల తయారీ కంపెనీలకే దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చేవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయి తయారీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం 27 బిలియన్‌ డాలర్లతో భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తొలుత ఆటో రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్స్‌ ఆధారిత కార్లు తయారు చేసే కంపెనీలకు వార్షిక టర్నోవర్‌లో 10%-20% నిధులను నగదు రూపంలో ఆయా సంస్థలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లలో కనీసం 272 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం షరతు విధించే అవకాశం ఉంది. ఇదే తరహాలో విడిభాగాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు సైతం షరతులతో కూడిన ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

వాతావరణ మార్పులు, పారిస్‌ ఒప్పందం నేపథ్యంలో భారత్‌ స్వచ్ఛ ఇంధనం వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చమురు అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో దిగుమతుల కోసం విదేశాలపై భారీగా ఆధారపడాల్సి వస్తోంది. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిత్యావసర ధరలపైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యుత్తు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.

అయితే, ఇప్పటి వరకు దేశీయంగా ఇంకా అనేక వాహన సంస్థలు విద్యుత్తు వాహనాల తయారీ వైపు మళ్లాల్సి ఉంది. టాటా మోటార్స్ మాత్రమే గణనీయ స్థాయిలో విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్‌, హీరోమోటో కార్ప్‌ ఇప్పుడిప్పుడే ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని