Delhi Murder: శ్రద్ధా హంతకుడి పక్కా ప్లాన్‌.. సవాలుగా సాక్ష్యాలు..!

దిల్లీ హత్య కేసులో సాక్ష్యాలు గుర్తించడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. అందుకోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. 

Updated : 17 Nov 2022 12:10 IST

దిల్లీ: దిల్లీ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియురాలిని ముక్కలుగా కోసి, దిల్లీలో పలుచోట్ల విసిరినట్లు నిందితుడే విచారణలో అంగీకరించాడు. తాజాగా వెలుగులోకి వస్తోన్న విషయాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ కేసు గురించి ఇప్పటికే అన్ని వివరాలు ఉన్నప్పటికీ.. దానిని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. మరోపక్క నేటితో నిందితుడు అఫ్తాబ్ కస్టడీ గడువు ముగిసిపోనుంది. కోర్టు మరికొన్ని రోజులు అతడిని కస్టడీకి ఇస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

కావాల్సింది ఈ సాక్ష్యాలే..

* మృతురాలు శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ అమీన్‌ పూనావాలా హత్య చేసి, ముక్కలుగా కోసేందుకు వాడిన ఆయుధాన్ని ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు. ఒక హత్యను నిరూపించే విషయంలో ఆయుధం అత్యంత కీలకం. హత్య జరిగి ఇప్పటికి ఆరు నెలలవుతుంది. ఒకవేళ దానిని స్వాధీనం చేసుకున్నా.. దానిపై రక్తపు మరకలు, వేలిముద్రలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.

మృతి చెందిన సమయంలో శ్రద్ధా వేసుకున్న దుస్తులను కనుగొనాల్సి ఉంది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ దుస్తులను అతడు చెత్త వ్యాన్‌లో వేశాడు. ఇప్పుడు వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది.

మరో కీలక సాక్ష్యం మొబైల్‌ ఫోన్‌. అది కూడా దొరకలేదు. హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది అత్యంత కీలకం. లాగిన్‌ హిస్టరీని బట్టి ఆమె చివరగా ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకు వీలవుతుంది.

ముక్కలుగా కోసిన శ్రద్ధా శరీర అవయవాలను ఒక ఫ్రిజ్‌లో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కానీ ఆ ఫ్రిడ్జ్‌ను హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌తో శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. శ్రద్ధా డీఎన్‌ఏ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు దానిని వాడాడు. ఇప్పుడు దీనినుంచి ఏదైనా ఆధారాన్ని సేకరించే వీలుందో లేదో ఇంకా స్పష్టత లేదు.

అలాగే హత్యకుముందు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని విచారణలో అఫ్తాబ్ వెల్లడించాడు. కానీ ఆ గొడవ గురించి పొరుగున ఉన్నవారు ఎవరూ వినలేదని తెలుస్తోంది. దాని గురించి ఎవరైనా సమాచారం వెల్లడిస్తే.. ఈ కేసుకు ఉపకరిస్తుంది.

ఇక శ్రద్ధా శరీర అవయవాలను దిల్లీలోని అటవీ ప్రాంతంతో పాటు, పలు చోట్ల విసిరినట్లు అఫ్తాబ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో వెతగ్గా ఇప్పటివరకూ 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి. ఈ తరహా కేసు దర్యాప్తుల్లో ఎముకలు కీలకం. హత్య ఎప్పుడు జరిగింది, కారణం ఏమిటో తేలే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికి దొరికినవి శ్రద్ధావేనా..?  అసలు ఒక మనిషికి సంబంధించినవేనా..? అన్న విషయాలు తేలాల్సి ఉంది. 

వాటర్‌ బిల్లు కీలకంగా మారనుందా...?

ఇంటికి ప్రతినెల ఉచితంగా సరఫరా అయ్యే 20 వేల లీటర్ల కంటే అధికంగా నీటిని అఫ్తాబ్‌ వినియోగించాడని పోలీసులు గుర్తించారు. శరీర భాగాలను కత్తిరించే శబ్దం వినిపించకుండా ఉండేందుకు ట్యాప్ తిప్పే ఉంచాడని తేలింది. శరీర భాగాలపై ఉన్న రక్తాన్ని కడిగేందుకు, ఇంటిలోని ఆనవాళ్లను చెరిపేందుకు నీటిని ఎక్కువగా వినియోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో రూ.300 మేర పెండింగ్‌ బిల్లు వచ్చిందన్నారు. ఇది కేసులో కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఉచిత నీటి సరఫరాతో అక్కడ ఉన్న అన్ని ఇళ్లకు దాదాపు జీరో బిల్లు వస్తుంది. వారు అద్దె నిమిత్తం ఆ ఇంటికి మే 14న వచ్చారు. ‘అంత వాటర్ బిల్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతి నెల సరిగ్గా అద్దె కట్టేవాడు. దాంతో నాకు వారి ఫ్లాట్‌కు వెళ్లాల్సిన అవసరం రాలేదు’ అని యజమాని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని