Road Accident: పగబట్టిన మృత్యువు.. ఒకే ప్రయాణంలో రెండు ప్రమాదాలు

ఆ కుటుంబాన్ని గంటల వ్యవధిలో ప్రమాదాలు వెంటాడాయి. తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడగా.. రెండోసారి జరిగిన ప్రమాదం తల్లి, కుమార్తెలను బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం

Published : 13 Dec 2021 06:43 IST

తల్లి, నాలుగేళ్ల కుమార్తె మృతి
తండ్రి, రెండేళ్ల కుమారుడి పరిస్థితి విషమం

గుమ్మడిదల, న్యూస్‌టుడే: ఆ కుటుంబాన్ని గంటల వ్యవధిలో ప్రమాదాలు వెంటాడాయి. తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడగా.. రెండోసారి జరిగిన ప్రమాదం తల్లి, కుమార్తెలను బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పరిధిలో ఆదివారం ఈ ప్రమాదాలు జరిగాయి. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదలకు చెందిన కమ్మరి బ్రహ్మచారి(32), ఆయన భార్య కల్పన(25), కుమార్తె కృతికశివాని(4), కుమారుడు కార్తీక్‌(2)లు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ శివారులోని బొల్లారంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. దోమడుగులో వీరి వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలు కావడంతో తేరుకుని సమీపంలోని అన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. శుభకార్యానికి వెళ్లకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ దోమడుగు పరిధికి రాగానే ఓ మలుపు వద్ద ద్విచక్ర వాహనం రెండోసారి అదుపు తప్పి విభాగినిని బలంగా ఢీకొంది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మధ్యలో కల్పన, కృతికశివాని మృతి చెందారు. బ్రహ్మచారి, కుమారుడు కార్తీక్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో సూరారంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని