పంటపై వానర మూకల దాడి.. ఆగిన రైతు గుండె

చేతికొచ్చిన వేరుశనగ పంటపై వానర మూకలు దాడి చేస్తుంటే కాపాడటానికి ఆ రైతు శతవిధాలా ప్రయత్నించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు గుండె ఆగి పంట చేనులోనే కుప్పకూలిపోయారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది

Published : 17 Jan 2022 04:54 IST


ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: చేతికొచ్చిన వేరుశనగ పంటపై వానర మూకలు దాడి చేస్తుంటే కాపాడటానికి ఆ రైతు శతవిధాలా ప్రయత్నించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు గుండె ఆగి పంట చేనులోనే కుప్పకూలిపోయారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన పందిరి రవీందర్‌రెడ్డి (55) ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేశారు. శనివారం రాత్రి వర్షం కురియడంతో ఆదివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లారు. అప్పటికే చేనులో వర్షపు నీరు నిలిచి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన కోతుల గుంపు వేరుశనగ మొక్కలను పీకేస్తుండటాన్ని గమనించారు. దీంతో తోటి రైతుల సహకారంతో వాటిని తరిమికొట్టేందుకు పరుగులు తీశారు. సగానికిపైగా పంటను కోతులు చెడగొట్టాయని, దిగుబడి రాక నష్టపోతానంటూ ఆవేదన చెందుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి రైతులు వెంటనే ఆయనను గ్రామంలోని ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మరణించినట్లు తెలిపారు. రైతు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పంటలను కోతుల బెడద నుంచి రక్షించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని