దస్తగిరి ‘అప్రూవర్‌’ ఉత్తర్వులు సరైనవే

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ (సీజేఎం) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని

Published : 21 Jan 2022 05:37 IST

వాదనలు వినిపించిన సీబీఐ
పిటిషన్‌పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ (సీజేఎం) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని గురువారం సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అప్రూవర్‌గా మారేందుకు సీజేఎం కోర్టు ఉత్తర్వులిచ్చిందని, అవి సరైనవేనని చెప్పారు. దిగువ కోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రం, సాక్షుల వాంగ్మూలాల వివరాల రికార్డును సీల్డ్‌ కవర్‌లో హైకోర్టులో దాఖలు చేశారు. మరో వైపు దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతివ్వడంపై వివేకా హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సీజేఎం ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. నేర నిరూపణకు సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. దస్తగిరి తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతిస్తూ క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఇతర సాక్ష్యాలు లభ్యంగా ఉన్నాయనే కారణంగా అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్లు చెప్పడానికి వీల్లేదన్నారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ తీర్పును వాయిదా (రిజర్వు) వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని