Hyderabad News: హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం

రాజధాని నగరంలో ఉగ్రవాద సంస్థ ఐసిస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా) కార్యకలాపాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు(18) హైదరాబాద్‌ కేంద్రంగా కొద్దినెలల నుంచి ఐసిస్‌ సానుభూతిపరుల

Updated : 03 Apr 2022 07:07 IST

ఉగ్ర సంస్థ సభ్యులతో సంప్రదింపులు.. పాతబస్తీ వాసిపై కేసు

కేంద్ర నిఘా వర్గాల సమాచారం.. రహస్య ప్రాంతంలో పోలీసుల విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నగరంలో ఉగ్రవాద సంస్థ ఐసిస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా) కార్యకలాపాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు(18) హైదరాబాద్‌ కేంద్రంగా కొద్దినెలల నుంచి ఐసిస్‌ సానుభూతిపరుల తయారీకి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నాడు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి నుంచి ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఇరాక్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా యువతను పథకం ప్రకారం రెచ్చగొట్టి జిహాద్‌(పవిత్రయుద్ధం) సైనికులుగా తయారుచేస్తున్న ఐసిస్‌ సంస్థ సభ్యులతో పాతబస్తీ యువకుడు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. సామాజిక మాధ్యమాలు, ప్రత్యేక యాప్‌ల ద్వారా తన స్నేహితులు, సన్నిహితులను జిహాద్‌ వైపు మళ్లించేందుకు అవసరమైన సమాచారాన్ని, వీడియోలను వారికి పంపుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఐసిస్‌ నుంచి హవాలా ద్వారా నిధులు సేకరిస్తున్నాడని సమాచారం. సదరు టీనేజర్‌ ఐసిస్‌ సానుభూతిపరుడన్న సమాచారంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తీవ్రత ఆధారంగా చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దేశంలో విధ్వంసాలకు కుట్ర..

దేశంలోని మెట్రోనగరాలు, పట్టణాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్‌ ప్రణాళికను సిద్ధం చేసిందని నిందిత యువకుడి ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన పోలీసులు తెలుసుకున్నారు. ప్రార్థనామందిరాలు, ఇతర ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలపై బాంబు దాడులకు పథకం రచించినట్టు గుర్తించారు. నిందితుడు ఎప్పటి నుంచి ఐసిస్‌ సానుభూతిపరుడిగా మారాడు, కుటుంబ నేపథ్యంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఐసిస్‌ తరఫున హైదరాబాద్‌లో కొందరు యువకులు గతంలోనూ పనిచేశారు. వీరిలో ఎనిమిది మందిని జాతీయ దర్యాప్తు సంస్థ నాలుగేళ్ల క్రితం అరెస్ట్‌చేసింది. 2018లో మరో ఘటనలో ఇద్దరు యువకులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని