Telangana News: ఇంట్లో వాటా కోసం తండ్రిని అంబులెన్స్‌లో తీసుకొచ్చారు!

బాబాయి ఉంటున్న ఇంట్లో తమకూ వాటా ఇవ్వాలంటూ చావుబతుకుల మధ్య ఉన్న తండ్రిని ఆంబులెన్స్‌లో నేరుగా ఆ ఇంటికి తీసుకొచ్చి గొడవకు దిగిన ఉదంతమిది.

Updated : 12 May 2022 06:46 IST

నల్గొండ జిల్లాలో వారసుల గొడవ

బాబాయి ఉంటున్న ఇంట్లో తమకూ వాటా ఇవ్వాలంటూ చావుబతుకుల మధ్య ఉన్న తండ్రిని ఆంబులెన్స్‌లో నేరుగా ఆ ఇంటికి తీసుకొచ్చి గొడవకు దిగిన ఉదంతమిది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన హరినారాయణ, ప్రహ్లాద అన్నదమ్ములు. హరినారాయణకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. హరినారాయణ, ఆయన వారసులు దేవరకొండ మండల కేంద్రంలో ఉంటున్నారు. హరినారాయణ అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడటం లేదని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో.. బుధవారం ఆయనను అంబులెన్సులో నేరుగా చేపూరు గ్రామానికి తీసుకువచ్చారు. అంబులెన్సు సహా ప్రహ్లాద ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ప్రహ్లాద కుమారులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఇంటి గేటును ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. ఇంట్లో తమకూ వాటా ఇవ్వాలని.. లేకుంటే తమ తండ్రి చనిపోతే ఇక్కడే ఖననం చేస్తామని హరినారాయణ వారసులు బెదిరించారు. దీనిపై సమాచారం అందడంతో గుర్రంపోడు ఎస్సై శివప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో వాటా విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని, ఇలా చేయటం సరికాదని చెప్పడంతో హరినారాయణను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

- న్యూస్‌టుడే, గుర్రంపోడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని