Mancherial: నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది.

Updated : 29 Nov 2022 10:11 IST

నస్పూర్‌, న్యూస్‌టుడే: ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది. అమ్మానాన్నలకు కూడా భారం కాకూడదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు, పిల్లలను క్షమించమని కోరుతూ.. తాను పడిన వేదనంతా ఓ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్‌ నాగార్జునకాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు, నస్పూర్‌కు చెందిన వనిత (35)తో 15ఏళ్ల క్రితం వివాహమైంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య కుటుంబంతో నాగార్జునకాలనీ సింగరేణి క్వార్టర్‌లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనుమానంతో అతను వనితను తరచూ తీవ్రంగా వేధిస్తుండటంతో ఆమె భరించలేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరేసుకొని కనిపించడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై రవికుమార్‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తనను భర్త మానసిక క్షోభకు గురిచేసిన తీరుపై తల్లిదండ్రులు, పిల్లలను ఉద్దేశించి వనిత రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. ‘‘నా భర్త కిష్టయ్య పెద్ద సైకో.. ఎప్పుడు ప్రేమగా చూడలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్తే అనుమానించేవాడు. అతని వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాను. అందుకే చనిపోతున్నా..’’ అని పేర్కొంది. తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను లేఖలో కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని