Sunil Yadav: వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌

వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 

Updated : 08 Sep 2023 20:06 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సునీల్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును సునీల్‌ యాదవ్‌ కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శని, ఆదివారం, తర్వాత ఈనెల 17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బంది, వాహనంతో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. వాహనం, ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చును సునీల్ యాదవే భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సునీల్‌ యాదవ్‌ మధ్యంతర బెయిల్‌ గడువు ముగియగానే  కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి బెయిల్‌ ఇవ్వాలంటూ సునీల్‌ యాదవ్‌ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్‌ ఇవ్వాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైల్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని