logo

ఇంటింటికీ బియ్యం కాదు.. నగదే..!

‘అదేంటి కేజీ రూ.10 చొప్పున ఇస్తున్నారు కదా..! నువ్వేంటి రూ7 అంటున్నావు’ ‘చాలా రిస్క్‌ అవుతుంది. అయినా బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. నీ ఇష్టం అయితే ఇవ్వు. లేకపోతే లేదు’

Updated : 18 Aug 2022 11:13 IST

ఎండీయూల వాహనాల్లోనే అక్రమ రవాణా
ఈనాడు, అమరావతి


ఎండీయూల వద్ద బియ్యం బదులు నగదు అందిస్తున్న దృశ్యం

‘అదేంటి కేజీ రూ.10 చొప్పున ఇస్తున్నారు కదా..! నువ్వేంటి రూ7 అంటున్నావు’

‘చాలా రిస్క్‌ అవుతుంది. అయినా బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. నీ ఇష్టం అయితే ఇవ్వు. లేకపోతే లేదు’

ఇదీ ఎండీయూ ఆపరేటర్‌కు, లబ్ధిదారు రాలకు మధ్య జరిగిన సంభాషణ తరువాత లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా వేలిముద్ర వేయించుకుని నగదు ఇచ్చేశారు.

ఇది ఒక చోట జరిగే తంతు కాదు.. రెండు జిల్లాల్లో చాలాచోట్ల జరుగుతోంది. ప్రభుత్వం పేదలకు పనిదినాలు కలిసిరావాలని, ఇంటింటికే బియ్యం పథకం పేరుతో ఎండీయూలను ఏర్పాటు చేసింది. ఈ ఎండీయూలు బియ్యం పంపిణీ చేయకపోగా అదే బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. లబ్ధిదారులకు నగదు ఇచ్చి అదే వాహనంలో బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారు.\


ఉమ్మడి జిల్లాలో మొత్తం 813 సంచార వాహన యూనిట్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. గ్రామంలో ఒకచోట నిలిపి బియ్యం తీసుకునేవారికి బియ్యం, లేదంటే కేజీకి రూ.7 చొప్పున నగదు ఇచ్చేస్తున్నారు. ఇటీవల కంచికచర్లలో విజిలెన్సుదాడుల్లో బియ్యం భారీగా పట్టుబడింది. తాడేపల్లిలో విజయవాడ నుంచి తరలించే రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. భారీగా రవాణా..!

ఉభయ జిల్లాల నుంచి రేషన్‌ బియ్యం నేరుగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో విజిలెన్సు విభాగం చేతులెత్తేస్తోంది. గతంలో పౌరసరఫరాల సంస్థకు ప్రత్యేకంగా విజిలెన్సు విభాగం ఉంది. ప్రస్తుతం విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం చూస్తోంది. నిఘా విభాగాన్ని ఇంకా విభజించలేదు. రెండు జిల్లాల్లో ఇదే పర్యవేక్షిస్తోంది. ఇటీవల వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో ఎరువుల దుకాణాలపై నిఘా పెంచింది.  రెండు జిల్లాల నుంచి నెలకు రూ.200 కోట్ల వ్యాపారం రేషన్‌ బియ్యంతో జరుగుతోందని అంచనా. ఈ వ్యాపారంలో ఎంతోమంది ప్రముఖులే భాగస్వాములుగా ఉన్నారు. డీలర్ల నుంచి మాత్రమే కాకుండా మండల స్థాయి నిలువ గోదాముల నుంచి నేరుగా వందట టన్నుల బియ్యం లేపేశారు. కరోనా సమయంలో రాష్ట్ర కోటాతో పాటు కేంద్రం కోటా ఉచిత బియ్యం అందించడంతో ఎక్కువగా నల్లబజారుకు తరలించారు. ఈనెల నుంచి కేంద్రం ఆహార భద్రత కింద ఇచ్చే ఉచిత బియ్యం కోటా తగ్గించారు. నిరుపేదల కార్డులకు మాత్రమే అందిస్తున్నారు. ఈ బియ్యం తినేందుకు అనువుగా లేవని డీలర్లవద్దే విక్రయిస్తున్నారు. ఇవే బియ్యాన్ని నల్లబజారులో రూ.25వరకు విక్రయిస్తున్నారు. రొయ్యలు, చేపల చెరువుల వారు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు రూ.కేజీ 15 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వీటిని నానబెట్టి, ఉడకబెట్టి ఫీడ్‌గా అందిస్తున్నారు.

మాఫియా ముఠానే..!
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలోనూ వ్యాపారులు సిండికేట్‌గా ఉన్నారు. సమాచారం లీక్‌ కానివ్వరు. ఒకరిపై ఒకరు దాడులు నిషిద్ధం. లంచాలు ఉమ్మడిగానే ఇస్తున్నారు. పశ్చిమకృష్ణా ప్రాంతంలో ఓ మహిళ రింగ్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షంలో పలుకుబడి ఉండటంతో తను చెప్పిందే అమలు చేయాలి. ఒకవేళ లారీలు, ట్రక్కులు పట్టుబడితే డ్రైవర్లే బాధ్యత వహించాలి. తెరవెనుక పేర్లు బయటకు రావు. అధికారులు కూడా పరిశోధన ముందుకు వెళ్లనీయరు.  కొంత రీసైక్లింగ్‌, మరికొంత కాకినాడ పోర్టుకు, ఇంకొంత ఆక్వా వ్యాపారానికి వెళుతుంది. స్థానికంగా హోటళ్లవారు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని